దొంగలు బాబోయ్ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్ దొంగలు…
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానితుల కదలికలు గుర్తించిన నేపథ్యంలో చీరాల, పర్చూరు ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానితుల ఫొటోలతో పోస్టర్లు విడుదల చేసిన పోలీసులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.

మధ్యప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేరస్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
