Watch Video: పాడె కట్టి, పసుపు పూసి.. పాముకు అంతిమ యాత్ర.. ఎందుకిలా చేశారంటే..

|

May 16, 2024 | 12:42 PM

చనిపోయిన పాముకు హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు గ్రామస్థులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అరుదైన వింత సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.

Watch Video: పాడె కట్టి, పసుపు పూసి.. పాముకు అంతిమ యాత్ర.. ఎందుకిలా చేశారంటే..
Snake
Follow us on

ఏలూరు, మే 15: చనిపోయిన పాముకు హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు గ్రామస్థులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అరుదైన వింత సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. మన పూర్వీకుల నుంచి నేటి వరకు ఏ హిందూ కుటుంబంలోనైనా పురుషులు గాని, స్త్రీలు గాని చనిపోతే వారికి దహన సంస్కారాలు ఘనంగా నిర్వహిస్తారు. మృతదేహాన్ని కర్రలతో సిద్ధం చేసిన పాడెపై ఉంచి నాలుగు వైపులా నలుగురు పాడెను మోస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలి వెళ్లి అక్కడ కట్టెలపై మృతదేహాన్ని దహనం చేస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు మనం ఈ దహన సంస్కారాల గురించి మాట్లాడుకుంటున్నాం అని మీకు సందేహం కలగవచ్చు. ఎందుకంటే ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.. ఇందులో చెప్పుకోవడానికి ఏముంది అని అనుమానం రావొచ్చు. అయితే అక్కడ జరిగిన ఘటన వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఇలా కూడా చేస్తారనే సందేహం మీకు రాక మానదు. అసలు ఎక్కడ ఏం జరిగింది అనే కదా మీ ఆత్రుత. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో ఆ ఘటన గురించి వివరాలు తెలుసుకుందాం.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. చనిపోయిన ఓ పాముకి స్థానికులు ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనియాంసంగా మారింది. ఈ వార్త విన్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు అది భగవంతుని మహిమగా చెప్పుకుంటున్నారు. పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో మేళం వారి మెరక ప్రాంతంలో చనిపోయిన ఓ త్రాచుపాముని స్థానికులు గుర్తించారు. అయితే ఆ త్రాచుపాము ఎలా చనిపోయింది ఏంటి అనే కారణాలు మాత్రం తెలియలేదు. దాంతో అక్కడకు చేరుకున్న తర్వాత కొందరు స్థానికులు చనిపోయిన పాము మృతదేహాన్ని అలా విడిచి పెట్టడం పాపమని పాము భగవంతుని మరొక స్వరూపమని, ఆ పరమశివుడి కంటాభరణంగా అత్యంత శక్తివంతమైన జీవిగా భూమీ మీద నివసించే భక్తులతో పూజలు అందుకునేటువంటి పాముకు ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించాలని యోచించారు. అనుకున్నదే తడవుగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనుషులకు ఏ విధంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారో అదేవిధంగా కర్రలతో పాడెను సిద్ధం చేశారు. దానిపై చనిపోయిన పామును ఉంచి ఊరేగింపుగా గ్రామస్తులు అందరూ ముందుకు కదిలారు.

 

ఇవి కూడా చదవండి

దానికి ముందు ప్రాణం పోయిన పాముకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి తమ పూర్వజన్మ పాపాలు పోయి భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుకున్నారు. గ్రామస్తులందరూ పోటీలు పడి మరీ ఆ త్రాచు పాము ఉన్న పాడెను మోస్తూ స్మశాన వాటికకు వెళ్లి ఆ పామును కట్టెలపై ఉంచి నిప్పు వెలిగించి హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు ఘనంగా నిర్వహించారు. సాధారణంగా భగవంతుని స్వరూపంగా భావించే జంతువులను దహనం చేయడం ద్వారా వాటి ఆత్మలకు శాంతి చేకూరి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని హిందువుల నమ్మకం. అంతేకాక విషపూరిత జంతువుల కళేబరాలను పూడ్చి పెట్టడం కన్నా దహనం చేయడమే శ్రేయస్కరమని కొందరు చెబుతున్నారు. అయితే మరికొందరు మృతి చెందిన జంతు కళేబరాలను నుండి విష వాయువులు విడుదలవుతాయని, ఆ విష వాయువులను మనిషి పీల్చినప్పుడు అనారోగ్యం పాలవుతారని అందుచేత మృతదేహాలను పూడ్చి పెట్టడం కన్నా అగ్నిలో దహనం చేయడమే మంచిదని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మొగల్తూరులో జరిగిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర చర్చనియాంశంగా మారింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..