Nellore District: డాక్టర్ కాదు రాబందు.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం.. ప్రభుత్వం సీరియస్

అసలే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టెడు దుఃఖం. సూసైడ్ కావడంతో పోస్టు మార్టం చేయాల్సిన దైన్యం. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో ఆ కుటుంబముంటే.. లంచం లేందే పోస్టుమార్టం చేసేది లేదన్నాడు వైద్యుడు. ఇంతకీ ఎక్కడ జరిగిందీ ఘటన ఆ వివరాలేంటి..?

Nellore District: డాక్టర్ కాదు రాబందు.. శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం.. ప్రభుత్వం సీరియస్
Nellore District News

Updated on: May 05, 2022 | 8:53 AM

 Nellore Doctor Bribe: నెల్లూరు జిల్లా ఉదయగిరి(Udayagiri) ప్రభుత్వాస్పత్రిలో ఓ డాక్టర్ కక్కుర్తి వ్యవహారం తెల్లకోటు వృత్తికే కళంకం తీసుకొచ్చింది. పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ చందాని బాషా ఏకంగా పదిహేను వేలు డిమాండ్ చేశాడు. పేద కుటుంబం అనే మానవత్వం లేకుండా శవంపై చిల్లర ఏరుకునే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారం నెల్లూరులో హాట్‌ టాపిక్‌గా మారింది. ఉదయగిరి ప్రభుత్వాస్పత్రిలో కాసుల వేటపై ప్రభుత్వం సీరియస్సైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణ అనంతరం వైద్యుడిపై చర్యలు తీసుకుంది. ఆ డాక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుడు ముదిరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) కుక్కునూరు మండలం రాయకుంట గ్రామం పొట్ట చేతబట్టుకుని..తన పెళ్లాం పిల్లలతో సహా ఉదయగిరికి వచ్చాడు..యజమాని ఇస్తానన్న జీతం డబ్బులు సరిగా ఇవ్వక పోవడంతో పాటు అప్పుల భారం పెరగడంతో… తన కుటంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్ధం కాక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ చందాని బాషా లంచం డిమాండ్ చేశాడు. తనకి 15వేల రూపాయలు, అటెండర్ కి వెయ్యి రూపాయలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామన్నాడు. లేదంటే అంతే సంగతులని మోహమాటం లేకుండా తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక భార్య కన్నీరుమున్నీరైంది. ఆ ఆడియో వైరల్ కావడంతో బాషా ఇన్నాళ్ల పాటు ఎన్ని శవాలను పీక్కుతిన్నాడో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం..ఇతడో మానవ రాబందుగా మాట్లాడుకుంటున్నారు జిల్లా వాసులు..ఇంకా ఇలాంటి అభాగ్యులను ఎంతగా పీడించుకు తిన్నాడో అంటూ తిట్టి పోస్తున్నారు.. మరోవైపు గతంలోనూ వైద్యుడు చందాని బాషాపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. పోస్ట్‌మార్టానికి లంచం అడిగిన డాక్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన హైలెట్ అయ్యింది కాబట్టి.. 1 నెల లేదా 2 నెలలు సస్పెండ్ చేసి మళ్లీ విధుల్లోకి తీసుకుంటే.. ఇలాంటి లంచం రాబందులు మళ్లీ ఇలానే ప్రవర్తిస్తారు. శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెడితేనే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది.

Also Read: Hyderabad: ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. విచారణలో బయటపడ్డ కుమార్తె బాగోతం.. మైండ్ బ్లాంక్ అంతే