ఛాతీ నొప్పితో ఆస్పత్రికి మహిళ.. స్కానింగ్ తీయిస్తే కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు, ఒక కొవ్వొత్తి!
నరసరావుపేటలో 33 ఏళ్ల మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి అన్ని వస్తువులను బయటకు తీశారు. పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తండ్రి తెలిపారు.

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన శస్త్రచికిత్సలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన 33 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 14 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అనంతరం లాప్రోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేసి వాటన్నింటినీ వైద్యులు బయటకు తీశారు.
ఛాతీ నొప్పితో ఆసుపత్రికి..
మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల వివాహిత కొంతకాలంగా ఛాతీ నొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఆమెను నరసరావుపేటలోని మాతాశ్రీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు పలు పరీక్షలు నిర్వహించగా.. కడుపులో అసాధారణ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మరింతగా పరీక్షలు నిర్వహించి వాటి వివరాలను నిర్ధారించారు.
శస్త్రచికిత్స చేసి వస్తువుల తొలగింపు
కడుపుకు చిన్న రంధ్రం చేసి 14 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తిని విజయవంతంగా బయటకు తీశారు. వీటిలో ఓ పెన్నుకు క్యాప్ లేకపోవడంతో అది గుచ్చుకుని ఉండటం వల్లే ఆమెకు తీవ్రంగా ఇబ్బంది, నొప్పి కలిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఒకేసారి ఇన్ని వస్తువులను మహిళ ఎలా మింగిందో తమకు కూడా అర్థం కాలేదని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటన అత్యంత అసాధారణమైనదని పేర్కొన్నారు. ప్రస్తుతం శస్త్రచికిత్స అనంతరం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని వెల్లడించారు.
పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో..
బాధితురాలి తండ్రి నోముల హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె గత పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తనలో కూడా మార్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా ఆమె భర్త రెండు నెలల క్రితం విడాకులు ఇచ్చినట్లు తండ్రి వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మహిళకు వైద్య చికిత్సతో పాటు మానసిక ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణ కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
