
తిరువనంతపురం–నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ చుండూరు మండలం మోదుకూరు వద్దకు రాగానే స్లో అయింది. నెమ్మదిగా కదులుతున్న రైలు నుండి ఒక తల్లి ఇద్దరు బిడ్డలతో సహా కిందకి దిగింది. అక్కడే రైల్వే పనులు చేస్తున్న కూలీలతో కలిసి భోజనం చేసింది. తన బాధ అంతా చెప్పుకుంది. భర్తతో విభేదాల కారణంతో ఇళ్లు వదిలేసి వచ్చినట్లు కూలీలకు అర్ధమైంది. వారంతా కలిసి ఆమెను ఓదార్చినప్పటికీ, భాష తెలియకపోవడంతో ఇబ్బంది ఎదురైంది. సాయంత్రం వరకూ అక్కడే ఉన్న ఆమె, ఐదు గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడి కుమార్తె తో సహ ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఆ సమయంలో తనతో పాటు ఉన్న కొడుకును మాత్రం బయటకు నెట్టి వేసింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న వారిని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అప్పటి వరకూ ధైర్యంగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం.. కొడుకును బయటకు నెట్టి, కుమార్తెను తనతో ఉంచుకోవడం చూసిన వారి కళ్లు చెమర్చాయి. తల్లి ఒడి నుండి దూరమైన ఆరేళ్ల బాలుడిని స్థానికులు రైల్వే పోలీసులకు అప్పగించగా బాలుడిని వసతి గృహానికి తరలించారు.
పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగుచూశాయి. బీహార్ లోని సీతామర్తి జిల్లా బైర్గానియాలోని బింగాహి గ్రామానికి చెందిన పూనందేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇళ్లు వదిలి పెట్టి వచ్చింది. రైలుతో ఏడాది వయస్సు ఉన్న కుమార్తె, ఆరేళ్ల వయస్సున్న కొడుకుతో కలిసి ఎక్కడి వెళ్లాలో తెలియనిస్థితిలో మధ్యలోనే రైలు దిగేసింది. ఇద్దరి పిల్లలతో ఆత్మహత్య చేసుకునేందుకు మొదట ప్రయత్నించిన పూనందేవి రైల్వే ట్రాక్పై పడుకున్న తర్వాత చివరి నిమిషంలో మనస్సు మార్చు్కుని కొడుకును బయటకు నెట్టేసింది. కళ్లు మూసి తెరిచేంతలో కొడుకు బయటపడగా కుమార్తె, ఆమె మాత్రం రైలు చక్రాల కింద నలిగిపోయారు.
తమ కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైల్వే కూలీలు చలించిపోయారు. వెంటనే బాలుడిని తీసుకుని రైల్వే స్టేషన్ వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బీహర్లోని పూనందేవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..