ప్రపంచ సహకారంతో సముద్ర భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ అన్నారు. విశాఖపట్నంలో మారిటైమ్ సెమినార్ మిలన్ 2024ను ప్రారంభించిన ధంకర్, నౌకాదళాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడమే మిలన్ లక్ష్యమని అన్నారు. సముద్ర భద్రతకు మిత్ర దేశాల మధ్య మరింత భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు.
భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్-2024 విన్యాసాల్లో భాగంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కనువిందుగా కొనసాగుతోంది. విశాఖ సముద్ర తీరం ఆర్కే బీచ్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం కు చెంది, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు సూపర్ సోనిక్ యుద్ద నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య తొలిసారిగా విశాఖ జలాల్లో తమ ఠీవిని ప్రదర్శించి భారత పతకాన్ని రెపరెపలాడించింది.
మిలన్ 2024 లో ప్రత్యేకతలు ఎన్నెన్నో..
మిలన్ – 2024లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చిన యుద్ధనౌక ఐ ఎన్ ఎస్ విక్రాంత్ వాస్తవానికి తూర్పు నౌకాదళం కేంద్రంగానే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే పశ్చిమ తీరంలోనే వివిధ కార్యకలాపాల్లో ఇప్పటివరకు పాలుపంచుకున్న విక్రాంత్ ప్రస్తుతం తొలిసారిగా విశాఖకు చేరుకుంది. వాస్తవానికి విక్రాంత్ ను బెర్తింగ్ చేసేందుకు అవసరమైన బెర్త్ ఇక్కడ లేదు. విక్రాంత్ కు అనుగుణమైన భారీ బెర్త్ నిర్మించేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ తో నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పనులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి విశాఖ కంటైనర్ టెర్మినల్లో బెర్తింగ్ చేశారు. తొలి రోజు ప్రదర్శనలో విక్రాంత్ ప్రధాన ఆకర్షణ కానుంది.
మరోవైపు పశ్చిమ నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న మరో వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా రెండు రోజుల క్రితమే విశాఖ చేరుకుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను గంగవరం అదానీ పోర్టులో లంగరు వేసి సిటీ పరేడ్ సందర్భం గా అర్ కే బీచ్ లో ఎగ్జిబిట్ చేశారు. అలాగే రేపటి నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకూ జరిగే మిలాన్ సీ ఫేజ్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య లే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మిలాన్ – 2024 లో అత్యంత ప్రధానమైన ఈవెంట్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్. ఈ మిలన్ లో పాల్గొన్న దాదాపు 50 దేశాల ప్రతినిధులు ఆయా దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ పరేడ్ చేయడం అత్యంత కీలక ఘట్టం. మన భారత గడ్డపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు 50 కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనడం కన్నుల పండుగ లానే కాకుండా ఆయా దేశాల ప్రతిష్ట కు కూడా సంబందించిన అంశంగా కూడా మారింది.
ఇక యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలతో ఆర్కే బీచ్ లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది ప్రజలకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడం, వాటిని చూసి అచ్చెరవు ఒందడం తో పాటు గర్వపడడం వీక్షకుల వంతైంది. గగన తలంలో ఫైటర్ జెట్లు, హెలికాఫ్టర్ల విన్యాసాలు ఆకట్టుకోగా అమెరికా, రష్యా, ఇరాన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా ఇలా యాభై దేశాలకు చెందిన నౌకాదళాల బృందాలు ఈ మిలాన్లో పాల్గొన్నాయి.
మిలాన్ విన్యాసాల కోసం చేపట్టిన రిహార్సల్స్ విశాఖ నగరవాసులను ఇప్పటికే ఎంతో ఆకట్టుకున్నాయి. భారీ యుద్ద నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, పారాచూట్లతో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు నగర వాసులను ఆకర్షించాయి. వాటన్నింటికీ తలదన్నే విధంగా జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విశాఖ వాసులు గుండెల్లో పదిలంగా నిలిచిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…