AP News: పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో వెళ్లిన యువతి.. విజయవాడ వైపు వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. చివరికి

|

Aug 25, 2022 | 8:56 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన సారపు పోతురాజు (22), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతి ద్విచక్ర వాహనంపై విజయవాడ వైపు వెళుతున్నారు.

AP News: పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో వెళ్లిన యువతి.. విజయవాడ వైపు వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. చివరికి
Road Accident
Follow us on

Lovers road accident: ఏపీలోని కృష్ణా జిల్లా వీరవల్లి వద్ద ఓ ప్రేమ జంట బైక్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రియుడు దుర్మరణం చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన సారపు పోతురాజు (22), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతి ద్విచక్ర వాహనంపై విజయవాడ వైపు వెళుతున్నారు. ఈ సమయంలో వీరవల్లి ఆర్పీహెచ్ కాలనీ దాటుతుండగా.. జాతీయ రహదారి వంతెన రిటెయినింగ్ గోడను ఢీకొట్టారు. ఈ ఘటనలో పోతురాజు వాహనంపై నుంచి ఎగిరి సర్వీసు రహదారిపై పడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. బాగా రక్తస్రావం కావడంతో పోతురాజు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన యువతిని అత్యవసర వాహనంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు సమీపంలోని ఓ స్పిన్నింగు మిల్లులో సారపు పోతురాజు పనిచేస్తున్నాడు. ఈ సమయంలో యువతితో పరిచయం ఏర్పడి, అదికాస్త ప్రేమకు దారి తీసింది. అయితే యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 18న ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లోంచి వచ్చేసింది. దీనిపై తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. బహుశా వీరిద్దరూ రంపచోడవరం వెళ్లి.. వివాహం చేసుకుని తిరిగి తెనాలికి బయలుదేరారా? లేకుంటే వివాహం చేసుకునేందుకు వెళ్తున్నారా..? లేక యువతి పెద్దల్ని ఒప్పించేందుకు బయలుదేరి, ప్రమాదానికి గురై ఉంటారా..? అన్న విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి