గాల్లో గింగిరాలు తిరుగుతూ కోడిగుడ్ల లారీ బోల్తా.. ఆ తర్వాత కదా అసలు సీన్..!

రోడ్డంతా పచ్చసొన, తెల్లసొనలతో నిండిపోయింది.. వందల సంఖ్యలో కాదు ఏకంగా లక్షల సంఖ్యలో కోడిగుడ్లు రోడ్డుపై పగిలిపోయి నదిలా ప్రవహించాయి. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ఘోర లారీ ప్రమాదం జాతీయ రహదారిని కోడిగుడ్లమయం చేసింది. లారీ గాల్లో గిరికీలు కొట్టి బోల్తా పడటంతో లక్షల రూపాయల విలువైన గుడ్లు రోడ్డు పాలయ్యాయి.

గాల్లో గింగిరాలు తిరుగుతూ కోడిగుడ్ల లారీ బోల్తా.. ఆ తర్వాత కదా అసలు సీన్..!
Eggs Lorry Accident

Updated on: Jun 09, 2026 | 2:35 PM

రోడ్డంతా పచ్చసొన, తెల్లసొనలతో నిండిపోయింది.. వందల సంఖ్యలో కాదు ఏకంగా లక్షల సంఖ్యలో కోడిగుడ్లు రోడ్డుపై పగిలిపోయి నదిలా ప్రవహించాయి. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ఘోర లారీ ప్రమాదం జాతీయ రహదారిని కోడిగుడ్లమయం చేసింది. లారీ గాల్లో గిరికీలు కొట్టి బోల్తా పడటంతో లక్షల రూపాయల విలువైన గుడ్లు రోడ్డు పాలయ్యాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు భారీ మొత్తంలో కోడిగుడ్ల లోడ్‌తో ఒక లారీ బయలుదేరింది. అయితే, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు కిట్టమ్మకుంట వద్దకు రాగానే అద్దంకి – నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి, గాల్లో గిరికీలు కొడుతూ రోడ్డు పక్కన బోల్తా పడింది.

ఈ లారీలో సుమారు రూ. 43 లక్షల విలువైన 53 వేల కోడిగుడ్ల ట్రేలు, లక్షలాది గుడ్లు) ఉన్నట్లు సమాచారం. లారీ బోల్తా పడిన తీవ్రతకు దాదాపు 27 వేల గుడ్ల ట్రేలు అక్కడికక్కడే నలిగిపోయి, పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో హైవే అంతా కోడిగుడ్ల ద్రవంతో నిండిపోయి భీభత్సంగా మారింది. ప్రమాదం జరిగిన విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న వాటిలో పగలకుండా మిగిలిన గుడ్ల ట్రేలను ఎవరికి వారు పోటీ పడి మరీ ఇళ్లకు పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే లారీ అదుపుతప్పి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ పెద్ద ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

లారీ బోల్తా పడటం, రోడ్డంతా గుడ్ల ట్రేలు విరిగిపడటంతో అద్దంకి – నార్కెట్‌పల్లి హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీయించి, రోడ్డును శుభ్రం చేయించిన అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us