Andhra Pradesh: ఉల్లి రైతు కన్నెర్ర.. ధర దక్కడం లేదని రోడ్డెక్కి నిరసన

ఉల్లి రైతులు కంటతడి పెడుతున్నారు. సాక్షాత్తు సీఎం ఆదేశించిన కూడా అధికారులు స్పందించకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగరంలో ప్రధాన రహదారిపై ఉల్లి పంటను పారబోసి ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులు, వ్యాపారుల తీరుకు రైతులు ఇలా నిరసన తెలిపారు. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వేలాది వాహనాలు స్తంభించాయి.

Andhra Pradesh: ఉల్లి రైతు కన్నెర్ర.. ధర దక్కడం లేదని రోడ్డెక్కి నిరసన
Onion Farmers

Edited By:

Updated on: Sep 07, 2025 | 9:14 AM

అతివృష్టి అనావృష్టి కారణంగా ఉల్లి రైతు దెబ్బతిన్నాడు. ఎక్కడికక్కడ ఉల్లి పంటను పారవోస్తుండటం, టీవీల్లో ప్రసారం కావడంతో సీఎం స్పందించారు. ప్రతి రైతుకు న్యాయం జరగాలని క్వింటాల్‌కి 1200 రూపాయలకు తగ్గకుండా ప్రతి రైతు నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. మూడు రోజులపాటు సీఎం ఆదేశాలు అమలు అయ్యాయి. ఆ తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఉల్లి రైతు కడుపు మండింది. ఆగ్రహం కట్టలు తెలుసుకుంది. పంటను నడిరోడ్డు పైకి తెచ్చి పార పోశారు. ధర్నాకు దిగారు. దాంతో ఒక్కసారిగా కర్నూలు నగరం అల్లకల్లోలంగా మారింది.

కర్నూలు సిటీ కావడం, రైతులు ధర్నాకు దిగిన ఏరియా మెయిన్ రోడ్డు కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. హారన్‌ శబ్దాలతో నగరంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీరికి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎస్పీ మోహన్ రెడ్డి వామపక్ష నేతలు మద్దతు పలికారు. సాక్షాత్తు సీఎం ఆదేశాలకే దిక్కు లేకుండా పోతే ఎలా అని నిలదీశారు. రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతున్న సమయంలో జాయింట్ కలెక్టర్ నవ్య రైతుల దగ్గరకు వచ్చారు. సీఎం ఆదేశాల మేరకు తప్పకుండా అమలు చేస్తామని, ఎందుకు కొనలేదు కారణాలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.

రూ.1200లకు కు కొనాలని సీఎం ఆదేశిస్తే 200 నుంచి 500 మాత్రమే రైతులకు ధర పలుకుతుండటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మార్కెటింగ్ మార్క్ఫెడ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే గిట్టుబాటు ధర లేదని ఉల్లి రైతులు ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైతులు పురుగుల మందు డబ్బా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సి బెళగల్ మండల పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన బోయ కృష్ణ వెంకట నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కనీసం రవాణా ఖర్చులకు కూడా ధర లేకపోవడంతో మనస్థాపం చెందిన రైతులు ఆత్మహత్యాయత్నం చేయడం కంటతడి పెట్టిస్తోంది. రైతుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న తర్వాత అధికారులు వచ్చి పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..