
ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా అందాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో కొందరు ఉద్యోగుల తీరు వ్యవస్థకే మచ్చ తెస్తోంది. నంద్యాల జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని గోస్పాడు మండలం పసురుపాడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీల, సిబ్బంది హాజరును తనిఖీ చేస్తున్న సమయంలో, అక్కడి పంచాయతీ కార్యదర్శి మాటతీరు, ప్రవర్తన వింతగా ఉండటాన్ని కలెక్టర్ గమనించారు. ఆయన మద్యం సేవించి విధులకు హాజరయ్యారని అనుమానం రావడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగప్రవేశం చేసిన పోలీసులు సదరు సెక్రటరీకి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో ఆయన 65 శాతం మేర మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. పట్టపగలు, అది కూడా ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారి ఇలా మద్యం మత్తులో ఉండటం చూసి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ, సదరు పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు విధులకు సరిగ్గా హాజరుకాకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారు ఇదే రీతిలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే, విధులకు డుమ్మా కొట్టే వారు, అవినీతికి పాల్పడే వారు బయటపడతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల్లో కూడా ఈ ఘటన ఒక రకమైన కలకలాన్ని సృష్టించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..