AMD Imtiaz: వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మరో నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ప్రకటించారు.

AMD Imtiaz: వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా
Ias Imtiaz

Updated on: Dec 27, 2024 | 7:16 PM

కర్నూలు (27 డిసెంబర్ 2024): వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ (AMD Imtiaz) ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఇంతియాజ్‌.. వైసీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో హఫీజ్‌ఖాన్‌ను కాదని ఇంతియాజ్‌కు వైసీపీ టికెట్ ఇచ్చినా ఓటమి తప్పలేదు.ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతియాజ్‌ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఇంతియాజ్..

2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఇంతియాజ్.. గ్రూప్ 1లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. రాజకీయ అరంగేట్రానికి ముందు ఆయన ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు. గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) సీఈవో, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ తదితర పలు హోదాల్లో పనిచేశారు.