Krishnapatnam port: ఎన్నికల వేళ ప్రభుత్వానికి సంకటంగా మారిన కృష్ణపట్నం పోర్టు తరలింపు!

దేశ అభివృద్ధి, రాబడి విషయంలో రవాణా వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. అందులోనూ ఓడరేవుల పాత్ర అత్యంత కీలకం. ఎగుమతులు.. దిగుమతులతో రాష్జ్త్రానికి ఆదాయం తెచ్చిపెట్టే రవాణా వ్యవస్థలో కీలకమైనది జల రవాణా. స్వాతంత్రానికి ముందు ఆతర్వాత పోర్టుల నిర్మాణం జరిగిన ఆయా ప్రాంతాల అభివృద్ధి చూస్తే ఇది స్పష్టం అవుతుంది.

Krishnapatnam port: ఎన్నికల వేళ ప్రభుత్వానికి సంకటంగా మారిన కృష్ణపట్నం పోర్టు తరలింపు!
Somireddy Chandramohan Reddy, Kakani Govardhan

Edited By:

Updated on: Jan 26, 2024 | 8:44 PM

దేశ అభివృద్ధి, రాబడి విషయంలో రవాణా వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. అందులోనూ ఓడరేవుల పాత్ర అత్యంత కీలకం. ఎగుమతులు.. దిగుమతులతో రాష్జ్త్రానికి ఆదాయం తెచ్చిపెట్టే రవాణా వ్యవస్థలో కీలకమైనది జల రవాణా. స్వాతంత్రానికి ముందు ఆతర్వాత పోర్టుల నిర్మాణం జరిగిన ఆయా ప్రాంతాల అభివృద్ధి చూస్తే ఇది స్పష్టం అవుతుంది. తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఇది ప్రాక్టిక‌ల్‌గా నిరూపితమైంది కూడా. ఆంద్రప్రదేశ్ లోని తీరప్రాంతంలో కూడా పోర్టుల నిర్మాణం తర్వాత ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి.. స్థానికుల జీవనోపాధి వృద్ధిలో అనూహ్యంగా మార్పు కనబడింది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పనులు పూర్తయి 2008లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి జిల్లాలో అభివృద్ధి పోర్టుకు ముందు.. పోర్టు వచ్చిన తర్వాత అన్నట్లుగా స్పష్టంగా కనబడింది. మొదట్లో నవయుగ సంస్థ ఆధ్వర్యంలో పోర్టు నడిచింది. 2020లో అదాని సంస్థ చేతిలోకి పోర్టు వెళ్ళింది. ఆతర్వాత కోవిడ్, వివిధ పరిస్థితుల కారణంగా రవాణా లెక్కల్లో తేడా మొదలైంది. కృష్ణపట్నం పోర్టు నుంచి ఐరన్ ఒర్, కోల్ , బియ్యం, పప్పు దినుసుల దిగుమతులు, ఎగుమతులు అవుతుంటాయి. ఇవి కాకుండా కంటైనర్ ద్వారా ఎలక్ట్రిక్, వగైరా వస్తువులు దిగుమతులు, ఎగుమతులు అవుతుంటాయి. కంటైనర్ తాలూకు రవాణా గతంతో పోల్చితే ఇప్పుడు డిమాండ్ తగ్గినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి..

దీంతో కంటైనర్ వింగ్ కృష్ణపట్నంలో పూర్తిగా నిలిపివేసి అదాని ఆధ్వర్యంలో నడిచే మరో పోర్టుకు తరలించాలని ప్రయత్నిస్తోన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయాన్ని మీడియా ముందు బయట పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కంటైనర్ పోర్టు ఇక్కడి నుంచి తరలిపోతే పది వేల మంది ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సోమిరెడ్డి ఆరోపణలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి సోమిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అలా జరిగే అవకాశమే లేదన్నారు. అదే జరిగితే ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమన్నారు కాకాని. కంటైనర్ పోర్టు తరలినా.. 10 వేల మంది ఉద్యోగాలకు ఇబ్బంది కలిగినా, ప్రజల తరపున పోరాటం చేస్తానని తెలిపారు. ఎలాంటి అపోహలకు తావులేదని.. పోర్టు యధావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోర్టు కేంద్రంగా తలెత్తిన అనుమానాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పోర్టు తరలిపోతే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం తగ్గడంతో పాటు.. పరోక్షంగా స్థానికులకు వచ్చే ఉపాధి కూడా దూరమవుతుంది. మరి దీనిపై రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు నష్టం లేకుండా ఎలాంటి ప్రయత్నాలు ఉంటాయో చూడాలి మరి..!!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…