
చిత్తూరు జిల్లా సోమల గ్రామానికి చెందిన బుజ్జమ్మ, ఆమె భర్త బాబు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం కర్ణాటకలోని కోలారు జిల్లాకు వలస వెళ్లారు. అలంగూర్లోని ఒక మామిడి తోటలో పనిచేస్తున్నారు. వీరికి కూతురు సరస్వతి (4), కుమారుడు హేమశ్రీ (15 నెలలు) ఉన్నారు. అంత వరకు బాగానే ఉంది..కానీ, ఇంతలోనే ఆ కుటుంబంలో ఊహించని విషాదం నిండింది. గత నెల 10వ తేదీన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భర్త బాబు మృతి చెందాడు. కట్టుకున్న భర్త హఠాన్మరణంతో భార్య బుజ్జి తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త అకాల మరణంతో ఆ మహిళ దిగ్భ్రాంతికి గురైంది. అప్పటి నుండి ఆమె తీవ్ర మానసిక ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళనతో బాధపడుతోంది. భర్త లేని జీవితం వృథా అని, పిల్లలను ఒంటరిగా పెంచడం సాధ్యం కాదనే భయాందోళనలు ఆమెలో పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే పూర్తిగా నిరాశలో మునిగిపోయిన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు చిన్న పిల్లలను ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చింది. పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత, ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలేందుకు ప్రయత్నించింది. అయితే, అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం విఫలమైంది.
కానీ, అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు బెడ్పై అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన బంధువులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ ఇద్దరు చిన్నారులు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోరకలిపై సమాచారం అందుకున్న గల్ పేట పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భర్త మరణం వల్ల కలిగిన మానసిక క్షోభతోనే ఆ మహిళ ఈ తీవ్ర చర్యకు పాల్పడిందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నంగళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..