Kanna Lakshmi Narayana: వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్‌లో ఉన్నా.. సమయం వచ్చినపుడు స్పందిస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ

జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు ఆయన ఇవాళ  జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరయ్యారు. భీమవరం వేదికగా జరిగే ఈ సమావేశాలకు..

Kanna Lakshmi Narayana: వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్‌లో ఉన్నా.. సమయం వచ్చినపుడు స్పందిస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ
Kanna Lakshminarayana

Updated on: Jan 24, 2023 | 11:45 AM

ఏపీ బీజేపీలో కొత్త కలకలకం చెలరేగుతోంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు ఆయన ఇవాళ  జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరయ్యారు. భీమవరం వేదికగా జరిగే ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో వ్యూహా రచన చేయనున్నారని సమాచారం. అయితే ఈ సమావేశాలకు కన్నా వెళ్లకపోవడంతో.. ఆయన బీజేపీని వీడనున్నారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇది నిజమేనా అంటూ కన్నాను ఫోన్లో సంప్రదించింది టీవీ9. తాను వ్యక్తిగత కారణాల వల్ల.. హైదరాబాద్‌లో ఉన్నాననీ.. అందుకే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కావడం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

ఇదిలా ఉంటే.. ఏపీ బీజేపీ మీడియా వ్యవహారాల ఇంఛార్జ్ సైతం స్పందించారు. కన్నా మరే పార్టీలోనూ చేరడం లేదనీ. కేవలం ఆయన వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ లో ఉన్నారనీ. ఈ కారణం వల్లే ఆయన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్నట్టు.. ఖండన చెబుతోంది ఏపీ బీజేపీ.

మరోవైపు ఈ నెల 26న కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా జనసేన పార్టీలో చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు జనసేన నాయకత్వం అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై కొంతకాలంగా కన్నా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. వీలు దొరికినప్పుడల్లా ఆయనపై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం