Andhra: సీక్రెట్‌గా ఎలా చేరుతున్నాయ్..? మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్..

జంగారెడ్డిగూడెంలో ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను ఉపయోగించి 20 వేల ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలగా, 7,550 ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సాయికిషోర్ మొబైల్ ఆధారంగా అక్రమ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra: సీక్రెట్‌గా ఎలా చేరుతున్నాయ్..? మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్..
AP Tramadol Injection Case

Updated on: Sep 06, 2026 | 5:38 PM

ఏపీ మత్తు ఇంజెక్షన్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.. దీని వెనుక పలువురి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో యువతను మత్తులో ముంచుతున్న అక్రమ ఇంజెక్షన్ల దందాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సాయికిషోర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్‌కు చెందిన సాయి కిషోర్… ‘శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను సంపాదించిన కిషోర్… అదే లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ వ్యాపారానికి తెరలేపినట్లు అధికారులు గుర్తించారు.

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడని ట్రామడాల్ ఇంజెక్షన్లే… ఈ అక్రమ వ్యాపారానికి ప్రధాన ఆయుధంగా మారాయి. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను ఉపయోగించి ఏకంగా 20 వేల ట్రామడాల్ ఇంజెక్షన్లను బల్క్‌గా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందులో ఏకంగా 12 వేల 450 ఇంజెక్షన్లను.. సరైన బిల్లులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌లోకి తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఇంజెక్షన్ కొనుగోలు ధర కేవలం 5 రూపాయలు కాగా… అక్రమంగా మాత్రం 20 నుంచి 50 రూపాయల వరకు విక్రయించినట్లు తెలుస్తోంది.

మత్తుకు బానిసలైన యువతే టార్గెట్‌గా… కొంతమంది వ్యక్తులు, స్థానిక మెడికల్ షాపుల ద్వారా ఈ ఇంజెక్షన్లను సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడులు నిర్వహించి దాదాపు 7 వేల 550 ట్రామడాల్ ఇంజెక్షన్ యాంప్యూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాయి కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తరహా కేసు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ఆధారంగా… ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఇంకెవరున్నారు..? ఇంజెక్షన్లు ఎవరికి సరఫరా చేశారు..? ఎక్కడెక్కడ విక్రయించారు..? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us