Pawan Kalyan: వినాయకుడిపైనే ఆంక్షలా.. ఏపీ సర్కార్‌ తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్!

|

Sep 07, 2021 | 9:45 PM

Vinayaka Chavithi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై మరోసారిగా ఘాటు స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వినాయక ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం తీవ్ర వ్యక్తం చేశారు.

Pawan Kalyan: వినాయకుడిపైనే ఆంక్షలా.. ఏపీ సర్కార్‌ తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్!
Pawan Kalyan
Follow us on

Pawan Kalyan on Vinayaka Chavithi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై మరోసారిగా ఘాటు స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వినాయక ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం తీవ్ర వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆంక్షల్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. మత విశ్వాసాలకు ప్రతీక అయిన వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడంపై పునరాలోచన చేయాలన్నారు. దేవాలయాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకి అనుమతివ్వాలన్నారు.

కరోనా నిబంధనల పేరుతో వినాయక చవితి ఉత్సవాలకు వర్తింపజేయడం ఎందుకని జనసేనాని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా? సంస్మరణ సభకు కరోనా లేదా? అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులా? అంటూ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చారని.. ఏపీలో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని పవన్ ప్రశ్నించారు. వెంటనే వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.

అలాగే, రోడ్ల కోసం వసూలు చేస్తున్న ట్యాక్స్‌లు ఏమయ్యాయని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిన్న గోతులను పెద్దవిగా, పెద్ద గోతులను కాలువలుగా మార్చి రోడ్ల అభివృద్ధిలో ప్రభుత్వం నిజంగానే అద్భుతం చేసిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అస్తవ్యస్తమైన రోడ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడిన దారులని, ప్రయాణించడానికి వీలు కాని దుస్థితిలో ఉన్న రోడ్లను వీడియోలు, ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనసేన పార్టీ వినూత్న నిరసనలకు దిగింది. రోడ్లను మరమ్మతులు చేయాలని జగన్ సర్కార్ మీద ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ సర్కార్ రోడ్ల మరమ్మత్తు చేయకుంటే గాంధీ జయంతి రోజున తామే శ్రమదానం చేసి రోడ్లు బాగు చేసేందుకు రంగంలోకి దిగుతామని జనసేన హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపధ్యంలో ఎపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో రోడ్ల పరిస్థితిపై పోరాటం చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పోలీసుల ముందే వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. రోడ్ల అధ్వాన్న స్థితిని తమ పార్టీ కార్యకర్తలు వెలుగులోకి తీసుకొస్తే దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్న భీమవరం అనకాపల్లి నేడు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పోలీసుల సమక్షంలోనే జనసేన నాయకులపై దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేస్తే నేనే స్వయంగా రోడ్లపైకి వస్తానని ఆ పరిస్థితి తీసుకు రావద్దని జనసేనాని హెచ్చరించారు. అంతేకాదు, రోడ్ల దుస్థితి పై తమ కార్యకర్తలు సమస్యని ఎత్తిచూపితే వాటి పరిష్కార మార్గాలు చూడకుండా అక్రమంగా తమ కార్యకర్తలపై కేసులు బనాయించడం, భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు న్యాయం అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ సోషల్ మీడియాకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కింద చూడొచ్చు..

Read Also… Kodali nani: ఏపీలో అడ్రస్‌ లేని బీజేపీ దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోంది: మంత్రి కొడాలి నాని