
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు సరికొత్త మలుపులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 18 మందిని ప్రకటించి బీ ఫామ్ లు ఇచ్చిన జనసేనాని మిగిలిన మూడు స్థానాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల పొత్తులో భాగంగా తొలుత జనసేనకు 24 ఎమ్మెల్యే అభ్యర్థులను కేటాయించినప్పటకీ కొన్ని సమీకరణాల దృష్ట్యా 21 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ ఇప్పటికే 139 మంది అసెంబ్లీ, 13 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. అధికార వైసీపీ అయితే 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పోటీదారుల జాబితాను విడుదల చేసింది. వీరు తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 18 స్థానాలకు శాసనసభ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది. అయితే మూడు స్థానాల్లో తీవ్ర ఉత్కంట కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో పాటు అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, ధర్మవరం, రాజంపేట నియోజకవర్గాలపై టీడీపి, బీజేపీ, జనసేన మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి. మూడు పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నారు. టీడీపీకి అవనిగడ్డ, రాజంపేట నియోజకవర్గాల్లో కొంత పట్టుంది. అలాగే బీజేపీకి కూడా రాజంపేటలో కొంత మేర ఓట్లు ఉన్నాయి. గతంలో ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేశారు. అప్పుడు ఆమెకు ఓటర్లు మంచిగానే స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఐదు శాసనసభ స్థానాలపై నాయకులు సర్వేలు చేయిస్తున్నారు. ఎవరికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయో చూసి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగిలిన మూడు స్థానాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పి. గన్నవరం, పోలవరం స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు తాజాగా బీ ఫామ్ కూడా ఇచ్చారు జనసేనాని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..