
యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం వచ్చానంటూ తిరుగుతూ.. హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థుల ల్యాప్టాప్లు చోరీ చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. అతని పేరు పతమిళ్ సెల్వన్. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాకు చెందిన ఇతడు న్యాయ విద్య అభ్యసించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సెల్వన్ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలపై టార్గెట్ పెట్టి.. అక్కడి వసతి గృహాల్లో ముందుగా పరిస్థితులను గమనించి రెక్కీ నిర్వహించేవాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే తిరిగి వచ్చి విద్యార్థుల ల్యాప్టాప్లను చోరీ చేస్తూ దొరక్కుండా తప్పించుకునేవాడు. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్లు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అమరావతి రాజధాని పరిధిలోని అమృత విద్యాపీఠం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వసతి గృహాల్లో ల్యాప్టాప్లు చోరీ అయినట్లు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు అందింది. విద్యార్థులు డిసెంబర్ 31న చోరీ జరిగిందని తెలిపారు. దీంతో పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ సేకరించి.. సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించగా.. చోరీలకు సెల్వన్ పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతడు గతంలో చెన్నై, గోవా తదితర ప్రాంతాల్లో కూడా విద్యాసంస్థల్లో చోరీలు చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలియని సెల్వన్.. రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీల్లో చోరీ చేయడం సులభమని భావించి మరోసారి అదే ప్రాంతానికి వచ్చాడు. అతని కదలికలను ముందుగానే గుర్తించిన పోలీసులు.. మంగళగిరి సమీపంలోని డాన్బోస్కో వద్ద అతడిని పట్టుకున్నారు.
ఈ నెల 2వ తేదీన సెల్వన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 15 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. పకడ్బందీగా చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాన్ని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు.