Weather Report: ఎండలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండాల్సిందే..
తెలగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో ఎండలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగే అవకాశముందని తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం మొదలైపోయింది. భానుడి భగభగలతో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. ఎండ వేడితో పాటు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉండగా.. ప్రజలకు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలపై ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట్ర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, ఎండ ప్రభావం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించింది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం.
ఏపీ ప్రజలకు అలర్ట్
మన్నార్ గల్ఫ్ నుండి తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక మీదుగా ఉత్తర అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందన్నారు. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందంది. ఇక దక్షిణ కోస్తాలో ఈరోజుపొడి వాతావరణం ఏర్పడే అవకాశముండగా.. రేపు, ఎల్లుండి కూడా పొడి వాతావరణం ఉంటుందంది. అటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. రాగల 5 రోజుల్లో ఏపీ,యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశంముందని, ఆ తరువాత 2రోజుల్లో క్రమంగా పెరిగే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణకు హెచ్చరికలు
ఇక తెలంగాణ లో రాగల మూడు రోజుల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ / ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయి. నిన్న ఒడిస్సా పరిసరాలలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
