Guntur Oxford College Scam: గుంటూరు జూనియర్ కాలేజీ చేతివాటం.. విద్యార్ధులకు JEE Main నకిలీ అడ్మిట్‌ కార్డులు జారీ!

ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ దారుణానికి ఒడిగట్టింది. నకిలీ అడ్మిట్ కార్డులను విడుదల చేసి విద్యార్ధుల భవిష్యత్తులును అంధకారం చేసింది. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 2 పరీక్షలకు హాజరుకవల్సిన విద్యార్థులకు నకిలీ అడ్మిట్‌ కార్డులు జారీ చేసిన వ్యవహారం గుంటూరులో వెలుగు చూసింది..

Guntur Oxford College Scam: గుంటూరు జూనియర్ కాలేజీ చేతివాటం.. విద్యార్ధులకు JEE Main నకిలీ అడ్మిట్‌ కార్డులు జారీ!
Guntur Oxford College JEE and NEET Scam

Updated on: Apr 10, 2026 | 3:45 PM

గుంటూరు, ఏప్రిల్ 10: లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటున్న ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ దారుణానికి ఒడిగట్టింది. నకిలీ అడ్మిట్ కార్డులను విడుదల చేసి విద్యార్ధుల భవిష్యత్తులును అంధకారం చేసింది. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 2 పరీక్షలకు హాజరుకవల్సిన విద్యార్థులకు నకిలీ అడ్మిట్‌ కార్డులు జారీ చేసిన వ్యవహారం గుంటూరులో వెలుగు చూసింది. ఇది ఆక్స్‌ఫర్డ్‌ కాలేజీ యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం. దీంతో ఏకంగా 15 మంది బాధిత విద్యార్ధులు పరీక్ష రాయలేకపోయామని కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మకు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీ జె పద్మ, ఆర్‌ఐవో జి సునీత విచారణ జరిపారు. దాదాపు 15 మంది విద్యార్థులకు కాలేజీ యాజమన్యం నకిలీ అడ్మిట్‌ కార్డులు జారీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా పరీక్ష రాసేందుకు బుధవారం గుంటూరులోని యూనివర్సల్, ప్రియదర్శిని కాలేజీకి వెళ్లగా.. అడ్మిట్‌ కార్డులను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని తెలిపారు. అనంతరం బుధవారం సాయంత్రం వరకు విద్యార్థులను అక్కడే కూర్చోబెట్టి పంపించారు.

15 మంది విద్యార్థులు స్వతంత్రంగా దరఖాస్తు చేసుకోకుండా కాలేజీ డీన్‌ మురళీకృష్ణారెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న మూర్తికి డబ్బులు ఇచ్చి దరఖాస్తు చేయాలని కోరారు. అయితే అతను దరఖాస్తు చేయకపోగా విద్యార్థులను ఏమార్చేందుకు వారికి నకిలీ అడ్మిట్‌ కార్డులు ఇచ్చినట్లు విద్యార్ధులు తెలిపారు. తాము రెండేళ్లుగా జేఈఈ మెయిన్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నామని, అప్లికేషన్‌కి డబ్బులు తీసుకుని.. అతడు దరఖాస్తు చేయకుండా మోసం చేశాడని బాధిత 15 మంది విద్యార్ధులు వాపోయారు. మే మొదటి వారంలో జరగాల్సిన నీట్‌ యూజీ 2026 పరీక్ష కోసం కూడా ఇలాగే 12 మంది విద్యార్థులు నిందితుడు మూర్తికి డబ్బులివ్వగా, వాళ్లకూ అసలు దరఖాస్తు చేయలేదని అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ పరీక్షలు ముగియడంతో తమ విలువైన విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వచ్చిందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మే నెలలో జరగాల్సిన నీట్ పరీక్షకు కూడా 12 మంది విద్యార్ధులు దూరమయ్యే పరిస్థితి దాపురించింది. విద్యార్ధుల వద్ద డబ్బులు వసూలు చేసి, వారి భవిష్యత్తును అంధకారం చేసిన సదరు మూర్తిని కఠినంగా శిక్షంచాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us