Andhra Pradesh: సభలో సస్పెండ్ అవ్వాలని ఎంపీలే కోరుకుంటారు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Sep 11, 2022 | 12:05 PM

మాజీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ గా పనిచేసిన వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కొందరు మిత్రులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యసభలో సభ్యుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సభలో..

Andhra Pradesh: సభలో సస్పెండ్ అవ్వాలని ఎంపీలే కోరుకుంటారు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
Venkaiah Naidu
Follow us on

Andhra Pradesh: మాజీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ గా పనిచేసిన వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కొందరు మిత్రులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యసభలో సభ్యుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సభలో సభా మర్యాదలను పాటించకుండా.. ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు తాను గట్టిగానే మందలించేవాడినని గుర్తుచేసుకున్నారు. అయితే ఆతర్వాత సభలో ఇబ్బందికరంగా ప్రవర్తించిన వారిని తన దగ్గరకు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేవాడినని, వారు ఎందుకలా చేస్తున్నారని ఆరా తీసేవాడినని తెలిపారు. అయితే దానికి సదరు సభ్యులు చెప్పే సమాధానం తనకు ఆశ్చర్యాన్ని కలిగించేవన్నారు. కొందరు సభ్యులు అయితే కావాలనే అలా చేస్తున్నామని.. మీరు తమపై కోప్పడాలని, సస్పెండ్ చేయాలని, అప్పుడే మాపార్టీకి, అధినాయకులకు నచ్చుతుందని చెప్పేవారని గుర్తుచేశారు. చట్టసభల్లో కొందరు సభ్యుల ప్రవర్తన చాల ఇబ్బందికరంగా ఉంటోందన్నారు. సభలో అర్థవంతంగా చర్చలు జరిగేందుకు సభ్యులు, పార్టీలు సహకరించాలన్నారు. విమర్వలు చేయడంలో తప్పులేదని.. అవి దూషణలకు దారితీయకూడదన్నారు. సభలో సభ్యుల అభ్యంతరకర ప్రవర్తనను నియంత్రించే బాధ్యత ప్రతి రాజకీయపార్టీపై ఉందన్నారు. ప్రతి రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా ప్రవర్తనా నియమావళిని రూపొందించి.. అమలుచేయడం ద్వారానే ఇది సాధ్యమవుతోందన్నారు.

ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరులోని ఓ ప్రయివేటు యూనివర్సిటీలో జరిగిన ఆత్మీయ సమావేశంలోనూ ఆయన పాల్గొని రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూడటానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని పేర్కొన్నారు. దేశ యువత ఉత్సాహం, ఉత్తేజంతో ఉండాలని.. దేశానికి అసలైన సంపద యువతేనని పేర్కొన్నారు. తరచూ పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, కుల,మతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్ధతి కాదని వెంకయ్యనాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..