
కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ అదృష్టం కలిసి వచ్చింది. సముద్రంలో వేసిన వలలకు పెద్దపెద్ద చేపలు భారీ ఎత్తున చిక్కడంతో గంగపుత్రులకు పంట పండింది. అందులోనూ.. కొమ్ముకోణం చేపలు.. విలువైన ఎల్లోఫిన్ ట్యూనా చేపలు అధిక సంఖ్యలో లభించడంతో సంబర పడిపోయారు. సముద్రంలో వలలకు చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు తమ పడవలలో తీసుకువచ్చి కాకినాడలోని కుంభాభిషేకం రేవు ఒడ్డుకు చేరవేయడంతో సందడి నెలకొంది. భారీగా బరువు కూడా ఉండడంతో ఆయా చేపలను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు అవస్థలు పడ్డారు.
కాకినాడ కుంభాభిషేకరం రేవుకు ఒకేసారి భారీగా చేపలు రావడంతో సందడి నెలకొంది. అరుదైన చేపలు ఎక్కువగా రావడంతో సమాచారం అందుకున్న స్థానికులు, చేపల వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో రేవుకు చేరుకున్నారు. ఈ చేపలన్నింటినీ వరుసగా పేర్చడంతో కాకినాడ కుంభాభిషేకం రేవు చేపల ఎగ్జిబిషన్గా మారిపోయింది. ఆ చేపలను చూసేందుకు స్థానికులు పోటీ పడ్డారు. దీంతో.. ఆ ఏరియా అంతా కొత్త చేపల జాతరను తలపించింది.
మార్కెట్లో ఈ చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో ధరలు కూడా భారీగా పలికాయి. ముఖ్యంగా.. కొమ్ముకోణం చేప ఒక్కొక్కటి సుమారు 20 వేల నుంచి 30 వేల రూపాయల వరకు ధర పలుకగా.. ఎల్లోఫిన్ ట్యూనా చేపలు 5 వేల నుంచి రూ.7 వేల రూపాయల వరకు అమ్ముడయ్యాయి. ఒడ్డుకు తీసుకురావడం, వాటిని శుభ్రం చేయడం.. లోడింగ్ చేయడం లాంటి ప్రక్రియ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది.
ఇక.. దేశీయ మార్కెట్లో ట్యూనా ఎగుమతి కేరళకు ఎక్కువగా జరుగుతోంది. శుద్ధి చేసిన ట్యూనాలు అమెరికా, థాయ్లాండ్, హాంకాంగ్, మలేసియా, వియత్నాం, చైనా లాంటి దేశాలకు అధిక సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయి. ఈ చేపల్లో ముళ్లు తక్కువగా ఉంటాయి. అధికశాతం ప్రొటీన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ నెలకొంది. సాధారణంగా లభించే చేపలకంటే అరుదైన చేపలు.. పెద్దపెద్దవి ఎక్కువగా వలలకు చిక్కడంతో కాకినాడ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్లోనూ మంచి ధర రావడంతో సంతోషంగా ఉందన్నారు. కాకినాడ తీరంలో చాలా రోజుల తర్వాత ఇలాంటి అరుదైన భారీ చేపలు దొరికాయని.. వీటి ద్వారా మంచి ఆదాయం వస్తుందని గంగపుత్రులు తెలిపారు. మొత్తంగా.. కాకినాడ తీరంలో అరుదైన చేపలు, అతిపెద్ద చేపలు దొరకడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు. ప్రతి రోజు ఎన్నో ఆశలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కొమ్ముకోణం, ఎల్లోఫిన్ ట్యూనా చేపలు భారీగా వలల్లో చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చినట్లు అయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..