బొకారో ఎక్స్ప్రెస్లో అద్భుతం.. తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
రైలు ప్రయాణంలో ఎదురైన ఒక అత్యవసర పరిస్థితి, తోటి ప్రయాణికుల చొరవతో ఒక మధుర జ్ఞాపకంగా మారింది. కదిలే రైలులో మానవత్వం పరిమళించిన ఈ సంఘటన మనసును హత్తుకునేలా ఉంది. ఆపదలో ఉన్న ఒక గర్భిణీకి తోటి ప్రయాణికులే వైద్యులుగా మారి, ఒక నిండు ప్రాణాన్ని లోకంలోకి తెచ్చిన తీరు నిజంగా అభినందనీయం. ఎలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిచిన బొకారో ఎక్స్ప్రెస్లో ఒక మహిళా ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ట్రైన్ నెంబర్ 13352.. ధన్బాద్ కు రైలు వెళుతుంది. చెన్నై కు చెందిన ఓ మహిళ ఆమె భర్త తల్లి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ధన్బాద్ కు వెళుతూ ఉన్నారు. రైలు తుని స్టేషన్ దాటగానే.. గర్భిణీ అయినా మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం ఆందోళన చెందింది. టీటీఈకి సమాచారం వెళ్ళింది.. ఎలమంచిలి లో రైలు ఆగింది. 108 సిబ్బంది రాక కాస్త ఆలస్యమైంది. దీంతో తోటి మహిళా ప్రయాణికులే.. అన్నీ తామై ఆ మహిళకు సుఖ ప్రసవం చేశారు. బిడ్డ ఏడుపు వినిపించింది. అప్పటివరకు ఆ కంఫర్ట్ మెంట్ లో ఉన్న ఆందోళన ఒక్కసారిగా ఆనందంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ధన్బాద్ కు చెందిన ఇషాద్.. ఉద్యోగం రీత్యా చెన్నైలో నివాసం ఉంటున్నాడు. భార్య తరన్నుమ్ 8 నెలల గర్భిణీ. తల్లి రజియా, భార్య తరన్నుమ్ తో కలిసి 13352 అల్లప్పుజా – ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. ఆ రైలు తుని రైల్వే స్టేషన్ దాటగానే.. తరన్నుమ్ కు పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ప్రయాణికులు కూడా అయ్యో పాపం అనుకున్నారు. ఈలోగా రైల్లో టీటీఈ కి సమాచారం అందించారు. నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ కు రైలు చేరుకునేసరికి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో.. అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం అందించారు టిటిఈ. ఎలమంచిలి రైల్వే స్టేషన్లో అంబులెన్స్ సిద్ధం చేయాలని సూచించారు.. కాసేపటికి రైలు ఎలమంచిలి రైల్వే స్టేషన్ కు చేరుకుంది.. కానీ అంబులెన్స్ రాలేదు.
రైలును స్టేషన్ లోనే నిలిపివేశారు. ఇంతలో ఆ గర్భిణీ పరిస్థితి తీవ్రమవడంతో.. పరదేశి భోగి బి 1 లో తోటి ప్రయాణికులు చేయి చేయి కలిపారు. రైల్లో ఉన్న పురుషులందరినీ కంపార్ట్మెంట్ నుంచి బయటకు పంపేశారు. 108 సిబ్బంది ట్రైన్ దగ్గరకు వచ్చేలోగానే.. తరన్నుమ్ కు సుఖప్రసవం చేశారు. రైలులోనే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఏడుపు వినిపించగానే అప్పటివరకు ఉన్న వారంతా ఆనందంతో మురిసిపోయారు. నేపథ్యంలో దాదాపుగా 40 నిమిషాల పాటు బొకారో ఎక్స్ప్రెస్ రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది.. బాలింతను స్ట్రక్చర్ పై పట్టాలు దాటుకుంటూ ఆంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లారు. మహిళా టిటిఈ స్వయంగా ఆ పసిబిడ్డను 108 సిబ్బందికి అందించారు.
అత్యవసర సమయంలో రైలును ఆపి సహకరించిన రైల్వే అధికారులు సిబ్బందితో పాటు.. సకాలంలో స్పందించిన తోటి ప్రయాణికులకు ఇషాద్, అతని తల్లి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి తరన్నుమ్ కు ప్రసవానికి ఇంకా సమయం ఉంది. కానీ ముందే పురిటి నొప్పులు వచ్చి కాన్పు జరిగింది. ఈ విషయం ముందే తెలిస్తే చెన్నైలోనే బయలుదేరకుండా ఉండే వాళ్ళమని తోటి ప్రయాణికులతో అన్నారు ఇషాద్, అతని తల్లి. మొత్తమ్మీద తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.




