తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ సీరియస్ అయింది. కేసును నీరుగార్చారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులపై ఈసీ కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారం మరింత రాజుకుంది. ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై ఫిర్యాదు వచ్చిన పట్టించుకోని పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గతంలో తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్రెడ్డి , శివప్రసాద్పై వేటు వేసింది. తూర్పు పీఎస్ ఎస్సై జయస్వాములు, హెడ్కానిస్టేబుల్ ద్వారకానాథ్రెడ్డిని సస్పెండ్ చేసింది. గతంలో అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ను వీఆర్కు బదిలీ చేసింది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును సాక్ష్యాధారాలు లేవని కేసును మూసివేయించిన వీరిపై చర్యలు తీసుకుంది ఈసీ.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో అధికార వైసీపీ దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించిందంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టకుండా జాప్యం చేశారు. దీంతో ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో ఎవరూ లేని ఇంటిలో పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయి. చనిపోయిన వాళ్లకు సైతం ఓటు హక్కు కల్పించారు. అంతేకాదు డిగ్రీ అర్హత లేకున్నా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు నమోదు చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు తిరుపతి పోలీసులు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఈసీ కొరడా ఝళిపిస్తుంటే.. విపక్షాల నిరసన వినూత్న రీతిలో కొనసాగుతోంది. చంద్రగిరిలో దొంగ ఓట్లపై తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సుధా యాదవ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి ఓట్లను ఇంకా తొలగించకపోవడంతో చంద్రగిరి స్మశానం వాటిక వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సుధా యాదవ్. చనిపోయిన వారి సమాధుల వద్ద ప్రచారంలో భాగంగా వాల్ క్లాక్, కుక్కర్లు ఇచ్చి తనుకు ఓటే వేయాలని కోరారు. చంద్రగిరి నుంచి టీడీపీ టికెట్ను ఆశిస్తున్న బిసి నేత సుధా యాదవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..