Dr. Noori Parveen: సలాం డాక్టరమ్మా..! పది రూపాయలకే వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం

|

Feb 25, 2021 | 7:53 PM

సామాన్యులకు అందని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యం కేవలం పదిరూపాయలకే..అవును మీరు వింటున్నది నిజమే..రెండు ట్యాబ్లెట్లు కొనాలంటేనే పదిరూపాయలు సరిపోని ఈ కాలంలో ...

Dr. Noori Parveen: సలాం డాక్టరమ్మా..!  పది రూపాయలకే  వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం
Follow us on

సామాన్యులకు అందని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యం కేవలం పదిరూపాయలకే..అవును మీరు వింటున్నది నిజమే..రెండు ట్యాబ్లెట్లు కొనాలంటేనే పదిరూపాయలు సరిపోని ఈ కాలంలో …కేవలం పదిరూపాయలకు వైద్యం చేయడం ఏంటని అనుకుంటున్నారా..? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రూపాయికే వైద్యం చేసే వారని విని ఉంటాం. కానీ మారుతున్న కాలంలో కూడా 10 రూపాయలకే వైద్యం అందించి అందరి మన్ననలు పొందుతున్నారు ఈ యువడాక్టర్. ఈ రోజుల్లోనూ డబ్బుకోసం ఆశపడకుండా పేదరోగులకు అండగా నిలిచే అమృత మూర్తులలో ఒకరిగా నిలుస్తున్నారు డాక్టర్‌ నూరీ పర్వీన్‌.

విజయవాడలోని ఆటో నగర్‌కు చెందిన ఈమె పేరు నూరీ పర్విన్‌. వన్టౌన్ మౌలానా ఆజాద్ ఉర్దూ స్కూలులో పదవతరగతి వరకుచదివింది. ఆ తరువాత ఓప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేసింది. కడప ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఎంబీబీఎస్‌ సీటురావడంతో వైద్య విద్య కడపలో పూర్తిచేసింది. చిన్న తనం నుంచే పేదవాళ్లకు సాయం చేయాలనే ఆలోచన, తపనతోనే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఆమె తాత, నాన్న కూడా సమాజ సేవ చేస్తూండేవారని, అలా చిన్నప్పటి నుంచి వారి సేవలను చూసిన నూరీ….తనూ కూడా అదే కోవలో వెళ్లాలనుకుంది.

ఎంబీబీఎస్‌లో జాయిన్‌ అయిననాటి నుంచే… అక్కడ విద్యార్థుల సంఘంతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ క్రమంలో తన చదువు కేవలం డబ్బు సంపాదించేడానికి మాత్రమే మిగిలిపోకుండా పది మందికి ఉపయోగపడాలని అనుకున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తే పేదవాడు భయపడుతున్న వేళ…అలా తను ఉండకుండా ఎవరైనా తన ఆస్పత్రికి ఆనందంగా రావాలని ఆశించారు. ఓపీ ఫీజు 10 రూపాయలకే పెట్టి…కడపలోని పెద్ద దర్గా రోడ్డులో ఓ ప్రైవేటు క్లీనిక్‌ ప్రారంభించారు. బెడ్ అవసరమైన వారికి 50 రూపాయలు, 200లోపే మందులు ఇక్కడ లభిస్తాయి. ఐదుగురు సిబ్బందితో 24 గంటలూ పనిచేస్తోంది ఆ క్లినిక్.

చిన్నగా ప్రారంభమైన ఈ ఆస్పత్రి క్రమేణా పెద్ద, పెద్ద రోగాలను కూడా అంతే డబ్బుకు వైద్యాన్ని అందిస్తున్నారు. థైరాయిడ్, షుగర్, అస్థమాలాంటి పెద్దజబ్బులకు కూడా ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ యువ డాక్టర్‌ పర్వీన్‌ వైద్యం అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ కొంతమంది సిబ్బంది సహకారంతో వైద్య సేవలు అందించారు. భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి అక్కడ కూడా అన్ని విభాగాల్లోనూ 10 రూపాయలకే వైద్యం అందిస్తానని అంటున్నారు. తన ఆస్పత్రి ఉన్నంతవరకూ ఇలానే కొనసాగుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు…ఈ యువ వైద్యురాలు.

ఈ కాలంలో కూడాఇంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం ఎంతో గొప్ప విషయమని, తమకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా పదిరూపాయల డాక్టర్‌ పర్వీన్ వద్దకే వస్తామంటున్నారు ఇక్కడ వైద్యం కోసం వచ్చిన వారు. ఇక్కడ ఫీజుల భయం లేకుండా త్వరగా రోగం నయం అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సమాజం అంతా స్వార్థంతో నిండిపోయింది. బంధాలు, బంధుత్వాలు కూడా మటుమాయమవుతున్నాయి. డబ్బు మాయలో పడి జనం.. అయినవాళ్లను కూడా సరిగా చూసుకోవడం లేదు. ఈ క్రమంలో ఈ యువ డాక్టర్ వైద్యం అందిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం.. భావితరాలకు స్పూర్తిదాయకం.

Also Read:

డిజిటల్ మీడియా, ఓటీటీపై కేంద్రం కళ్లెం.. హద్దుమీరితే కఠిన చర్యలు.. పిల్లలు చూడకుండా నియంత్రణ.. ఫోటో స్టోరీ

Ex Minister Raghuveera Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఇప్పుడు ఇలా.. వైరలవుతున్న ఫోటోలు

Black magic: ఇంటిముందు పుర్రెతో క్షుద్రపూజల కలకలం.. భయానకం.. వైరలవుతున్న ఫోటోలు