
ఏపీలో వైసీపీ ఇన్ఛార్జీల విషయంలో కూడికలు తీసివేతల లెక్కలు కొనసాగుతున్నాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో ఎమ్మెల్యేలకు బదులుగా కొత్తవారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ నాయకత్వం. మరికొన్ని స్థానాల్లో కొత్త నేతలను ఇన్ఛార్జ్గా నియమించే ప్రక్రియపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆపీసు నుంచి పిలుపు వచ్చింది. దీంతో మంగళవారం ఏపీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్కు వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల తాకిడి కొనసాగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో పాటు జోగి రమేష్, మల్లాది విష్ణు, పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ, జక్కంపూడి రాజా, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ…సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సీఎంవోకు పయనమయ్యారు.
నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్టీ పెద్దలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. రీజినల్ కోఆర్డినేటర్లతో భేటీ అయిన సీఎం జగన్.. పలు స్థానాలకు ఇన్ఛార్జీల ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు. సీఎంతో భేటీలో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఇవాళ రాత్రికి కొన్ని సీట్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఈ క్రమంలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో మరిన్ని మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని అన్నారు. దాడి వీరభద్రరావు రాజీనామాపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యంకాదని చెప్పారు.
మరోవైపు రెండు, మూడు జాబితాల్లా కాకుండా..పూర్తి స్థాయిలో ఫైనల్ లిస్ట్ రెడీ చేసి రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లో వైసీపీ ఫైనల్ లిస్ట్ ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. దీంతో నేతల భవితవ్యమేంటో తేలిపోనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..