Viral Video: హైవేలపై వెర్రి వేశాలు.. బైక్లతో రెచ్చిపోయిన యువకులు.. సీన్ కట్చేస్తే..
చిత్తూరు జిల్లాలో కొందరు ఆకతాయిలు రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు హైవేలపై బైక్లతో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన చెన్నై- బెంగళూరు హైవేపై.. ఇప్పుడు ఈ యువకుల బైక్ స్టంట్స్ స్థానికులను, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

యువతలో రోజురోజుకూ రీల్స్ పిచ్చి ముదురుతోంది. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు యువకులు బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై తరచూ బైక్ రేసింగ్స్ చేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అర్థరాత్రి వరకు రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉండే హైవేపై యువకులు ఇలాంటి విన్యాసాలు చేయడంతో, ఆ రూట్లో వెళ్లాలంటేనే వాహనదారులు, స్థానికులు జంకుతున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. వీడియోల ఆధారంగా రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులను గుర్తించి, వారితో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లలకు స్వేచ్ఛ పేరుతో వాహనాలు కొనిచ్చి.. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
