Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను విడుదల చేస్తోంది. 24వ తేదీలోగా విడతల వారీగా అందరికీ అందించనుంది. 22వ తేదీన కొంతమంది ఖాతాల్లో జమ అవ్వగా.. ఇవాళ, రేపు అందరికీ పంపిణీ చేయనుంది.

ఏపీ ప్రభుత్వం “తల్లికి వందనం” డబ్బులను అకౌంట్లలో జమ చేస్తోంది. బుధవారం నిధుల విడుదల ప్రక్రియ మొదలుపెట్టగా.. శుక్రవారం నాటికి లబ్దిదారులందరికీ అందించనుంది. మూడు రోజుల్లో ప్రతీ ఒక్క లబ్దిదారుడికి అందనుంది. ఒకవేళ డబ్బులు పడకపోతే మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని కలిసి సమస్య తెలుసుకోవచ్చు. అధికారులు అందించే సూచనలు పాటించడం వల్ల మీరు సొమ్ము పొందే అవకాశముంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రదర్శించింది. దీంతో మీకు అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోయినా లేదా పేరు ఉండి నిధులు జమ కాకపోయినా సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోండి. అయితే తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం అర్హతలు నిర్దేశించింది. ఈ అర్హతలు ఉంటేనే లబ్ది పొందుతారు. ఆ అర్హతలు ఏంటంటే..?
అర్హతలు ఇవే..
-ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు
-రేషన్ కార్డు కలిగి ఉండాలి
-గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించి ఆదాయం ఉండకూడదు
-టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహా ఇతర ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు
-ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండకూడదు
– పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థలం ఉండకూడదు
– ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అనర్హులు
– పారిశుద్ధ్య కార్మికుల విషయానికొస్తే గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు పొందే ఉద్యోగులకు మినహాయింపు కల్పించారు
-ఈ అర్హతలు ఉంటే తల్లికి వందనం మీకు వర్తిస్తుంది. ఈ అర్హతలు లేకపోతే డబ్బులు అందవు.
డబ్బులు అందకపోతే ఏం చేయాలి..?
-మీ గ్రామ, వార్డు పరిధిలోని సచివాలయాన్ని సంప్రదించాలి
-గ్రీవెన్సులో ఫిర్యాదులు చేసి సమస్యను పరిష్కరించుకోవాలి
-డబ్బులు పడనివారికి గ్రీవెన్సులో ఫిర్యాదు చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది
-గ్రామ, వార్డు సచివాలయంలో వెల్పేర్ అసిస్టెంట్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలి
-మీ సమస్యను విని గ్రీవెన్స్ నమోదు చేస్తారు
-నిర్ణిత తేదీలోగా సచివాలయంలో గ్రీవెన్స్ నమోదు చేయాలి
గ్రీవెన్స్ ఎలా నమోదు చేస్తారు..?
-గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాలి
-తల్లి లేదా విద్యార్థి ఆధార్ వివరాలు అందించాలి
-చైల్డ్ ఎన్రోల్మెంట్ ఐడీ లేదా విద్యార్థి వివరాలు సమర్పించాలి
-అనర్హతకు కారణమైన ఆప్షన్ ఎంచుకుంటారు
-అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తారు
-ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు
-ఫిర్యాదులను సబ్మిట్ చేస్తారు
