
అదుపుతప్పి బోల్తా పడిన లారీ నుంచి ఏకంగా జనాలు మద్యం బాటీళ్లను ఎత్తుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు – పుత్తూరు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు లిక్కర్ డిపో నుంచి పల్లిపట్టు వద్ద ఉన్న కొల్లాగుంట మద్యం షాపునకు స్టాక్ లోడ్తో వెళ్తున్న ఓ బొలెరో వాహనం.. ఎస్ఆర్ పురం మండలం షికారి కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. అంతే.. వాహనంలో ఉన్న వందలాది మద్యం బాక్సులు నడిరోడ్డుపై పడిపోయాయి.
ఇక నడి రోడ్డుపై మద్యం బాటిల్ బాక్సులు పడిపోవడం స్థానికులకు లక్కీ ఛాన్స్ గా మారింది. కళ్ళ ముందు మద్యం సీసాలు పడి ఉండటంతో, విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. చేతికి దొరికిన మద్యం బాక్సులను, సీసాలను ఎత్తుకెళ్లేందుకు జనం పోటీ పడ్డారు. అందినకాడికి దోచుకెళ్లే క్రమంలో కొందరైతే ఏకంగా ఫీట్లు చేస్తూ పరుగులు పెట్టారు.
ప్రమాదానికి గురై నెత్తీ నోరూ బాదుకుంటున్న డ్రైవర్ను పలకరించే నాథుడే కరువయ్యాడు. అందరి కళ్లూ రోడ్డుపై ఉన్న బాటిళ్లపైనే ఉన్నాయి తప్ప.. డ్రైవర్ ఆవేదన ఎవరికీ పట్టలేదు. ఈ లోపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే రూ.12 లక్షల విలువైన మద్యం బాటిళ్లు మాయం చేసారు స్థానికులు.
తమకు ఇష్టమైన బ్రాండ్లు, కావల్సినన్ని మద్యం సీసాలు ఉచితంగా దొరకడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇళ్లలోకి సరుకులు తీసుకెళ్లినట్టు మద్యం బాక్సులను ఎత్తుకెళ్లారు. అయితే, వాహనం బోల్తా పడటమే కాకుండా.. ఉన్న స్టాక్ మొత్తం ఇలా లూటీ అయిపోవడంతో సదరు లిక్కర్ షాప్ యజమానికి కోలుకోలేని భారీ నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
వీడియో చూడండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.