AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gudlavalleru: గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు.. ఆమె పనేనా..

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో... హిడెన్‌ కెమెరాల వ్యవహారం సంచలనంగా మారింది. రాజకీయంగానూ రచ్చ లేపుతోంది. మహిళా కమిషన్‌ యమా సీరియస్‌గా ఉంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎలాంటి క్లూస్‌ లేవనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి అనుమానితులను విచారించిన అధికారులు ఏం తేల్చారు...? ప్రభుత్వ ఆదేశాలతో.. కేసులో ఎలా ముందుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు...? అసలిప్పుడు కాలేజీలో పరిస్థుతులెలా ఉన్నాయ్...?

Gudlavalleru: గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు.. ఆమె పనేనా..
Gudlavalleru College
Ram Naramaneni
|

Updated on: Aug 31, 2024 | 10:06 AM

Share

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గల్స్‌ హాస్టల్‌లోని వాష్‌రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు అమర్చారంటూ… ఆందోళనలు మిన్నంటాయి. కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో… ఇష్యూ నేషనల్‌ వైడ్‌గా హల్‌చల్‌ చేసింది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం ఫుల్‌ సీరియస్‌గా తీసుకుంది. సీఎం చంద్రబాబు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు… హాస్టల్‌ను పరిశీలించారు. రూము రూము తిరిగారు… కానీ ఎలాంటి క్లూస్‌ లేవంటూ తేల్చేశారు. రహస్య కెమెరాల వివాదంపై స్వయంగా ఎస్పీనే క్లారిటీ ఇచ్చారు. హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలను లేవన్నారు. క్షణ్ణంగా పరిశీలించినా… ఒక్క కెమెరా కూడా దొరకలేదంటూ ఒకింత షాక్‌ ఇచ్చారు ఎస్పీ గంగాధర్‌. అయితే విద్యార్ధినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని… అనుమానితుల నుంచి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. కేసు విచారణ జరుగుతోందని… నిందితులు ఎవరో తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పుడు హాస్టల్‌లో ఎలాంటి కెమెరాలు లేవని… ధైర్యంగా ఉండొచ్చని భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని, విద్యార్థి గుడ్లవల్లేరు జీఈసీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ ఫ్రెండ్స్. సదరు విద్యార్థినే గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు విమర్శిస్తున్నారు. వాటితో చిత్రీకరించిన తమ వీడియోలు, ఫోటోలను తన ఫ్రెండైన అదే జిల్లాకు చెందిన విద్యార్థికి పంపుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఇక అంతకుముందు మంత్రి కొల్లురవీంద్ర హాస్టల్‌ను సందర్శించారు. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్న ఆయన… నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ ఘటనలో ఎంతటి వారున్నా వదిలే సమస్య లేదన్నారు కొల్లు రవీంద్ర.

మరోవైపు ఏపీ మహిళా కమిషన్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. చైర్‌పర్సన్‌ వెంకటలక్ష్మి… గుడ్లవల్లేరు హాస్టల్‌ను సందర్శించారు. దర్యాప్తు జరుగుతుండగా బాత్రూమ్స్‌లో షవర్లను ఎందుకు మార్చారని మేనేజ్‌మెంట్‌ను ఆమె ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారని…. కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలేజ్ దగ్గర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థినులకు అండగా ఉంటామని… నిందితులు ఎవరో తేల్చేదాకా పోరాడుతామన్నారు. కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు… వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేటుచేసుకుంది. ఈ ఆందోళనలో పేర్ని కిట్టు, ఉప్పలపాటి హారిక, వరుదు కళ్యాణితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

వైసీపీ అధినేత జగన్‌ సైతం ఘటనపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. విద్యావ్యవస్థలపై నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తోందంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల జీవితాలను అతలాకుతలం చేసే ఘటనను సీరియస్‌గా తీసుకుని… నిందితులను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు జగన్‌.

ఇక ఈ రహస్య కెమెరాల వివాదం సంచలనం రేపిన నేపథ్యంలో… కాలేజీ, హాస్టల్‌కి మూడ్రోజులు సెలవులు ప్రకటించింది యాజమాన్యం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది.

మొత్తంగా… గుడ్లవల్లేరు గల్స్‌ హస్టల్‌లో సీసీ కెమెరా ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి… ఈ కేసు మున్ముందు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో…!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us