Chandrababu Arrest: ఏం జరగనుంది..? చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టులో కీలక విచారణ..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, అనంతరం ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసుతోపాటు పలు కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అక్టోబర్‌ 3, 4 తేదీలు టీడీపీకి కీలకం కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై మూడు కేసులు నమోదు కాగా..

Chandrababu Arrest: ఏం జరగనుంది..? చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టులో కీలక విచారణ..
Chandrababu Naidu Arrest

Updated on: Oct 03, 2023 | 7:29 AM

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, అనంతరం ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసుతోపాటు పలు కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అక్టోబర్‌ 3, 4 తేదీలు టీడీపీకి కీలకం కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై మూడు కేసులు నమోదు కాగా.. ఇవాళ, రేపు చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు సహా పలు కోర్టుల్లో విచారణ జరగనుంది. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ రానుంది. 6వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందని హైకోర్టులో పిటిషన్‌ వేశారు చంద్రబాబు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అక్రమమని పిటిషన్‌లో వాదన వినిపించారు చంద్రబాబు తరపు లాయర్లు. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో..

మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసుపై దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేశారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈకేసును విచారణ చేయనుంది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌ వేశారు. ఉండవల్లి పిటిషన్ రేపు విచారణకు రానుంది. బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులోను బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

రేపు లోకేష్‌, నారాయణ విచారణ..

నారా లోకేష్‌పై ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ స్కాం కేసులు నమోదయ్యాయి. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు ఢిల్లీలో CID నోటీసులు ఇచ్చింది. 4న విజయవాడ రావాలని సూచింది. నోటీసులు తీసుకున్న లోకేష్ విచారణకు వస్తానని రిప్లై ఇచ్చారు. అయితే స్కిల్‌ స్కాం కేసులో లోకేష్‌ను అక్టోబర్‌ 4వరకు అరెస్ట్ చేయోద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అటు హైకోర్టులో ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా పడగా.. ఇదే కేసులో అక్టోబర్‌ 4కు లోకేష్‌ పిటిషన్‌ను వాయిదా వేసింది హైకోర్టు. ఇటు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసులో ఏ2గా ఉన్న నారాయణ.. బెయిల్‌పై ఉన్నారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఈనెల 4న లోకేష్ తోపాటు విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..