
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఆరెస్ట్పై.. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుంటే.. మరోవైపు ఏసీబీ కోర్టులో పిటిషన్ల ఫైట్ నడుస్తోంది.. చంద్రబాబు హౌస్ కస్టడీపై రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. జైలు రిమాండ్ను హౌస్ రిమాండ్గా మార్చాలన్న పిటిషన్ను తిరస్కరించింది. అటు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సెక్యూరిటిపై ఆరోపణలు ప్రతిఆరోపణలు కొనసాగుతున్నాయి.
చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రాణహాని ఉందని.. ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో హౌస్ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉందని.. ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని కోర్టుకు వివరించారు. కరుడుకట్టిన నేరగాళ్లు ఉన్న జైలులో చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గిందని లూథ్రా వాదనలు వినిపించారు.
మరోవైపు చంద్రబాబుకు హౌస్ కస్టడీ అక్కర్లేదని సీఐడీ తరఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు హౌస్ కస్టడీ అనేదే సీఆర్పీసీలో లేదని.. ఇల్లు కంటే జైలే అన్ని రకాలుగా భద్రతగా ఉందన్నారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, భద్రత మధ్య ఉన్నారని కోర్టుకు వివరించారు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుందని.. పిటిషనర్ ఆరోగ్యం కోసం 24×7 వైద్యులు అందుబాటులో ఉన్నారని న్యాయమూర్తికి సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
సుదీర్ఘ వాదనలను విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిన్న సాయంత్రానికి తీర్పు ఇస్తారని భావించారంతా. అయితే మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే ఉత్కంఠ. ఫైనల్గా సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించి హౌస్ కస్టడీ పిటిషన్ను తిరస్కరించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇప్పుడు ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు స్కిల్ స్కామ్లో మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ కస్టడీ పిటిషన్ వేసింది. అటు చంద్రబాబు లాయర్లు కూడా కౌంటర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై వాదనల్ని రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్ట్. ఇక చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ను స్టడీ చేస్తామన్నారు సీఐడీ తరపు న్యాయవాదులు. రిమాండ్ రిపోర్ట్లో అన్ని ఆధారాలు పొందుపరిచామని.. చంద్రబాబును కచ్చితంగా కస్టడీ కోరుతామన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సెక్యూరిటిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. భద్రత లేదన్న ఆరోపణల మధ్య కుటుంబసభ్యులు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. స్వయంగా వెళ్లొచ్చిన వాళ్ల వాదనేంటి.. జైలు అధికారులు, ఏఏజీ ఇస్తున్న సమాధానాలేంటి? దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం జైలు నుంచి బయటికొచ్చాక చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు భువనేశ్వరి. రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతపై వస్తున్న ఆరోపణల్ని కొట్టిపడేశారు ఏఏజీ పొనువోలు సుధాకర్ రెడ్డి. జైలులో పూర్తిస్థాయి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారని.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి