Polavaram Project: వందేళ్ల రికార్డు బద్దలైంది. వర్షాకాలం ఆరంభంలోనే గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. గోదావరి రివర్ హిస్టరీలోనే జులై నెల రికార్డు సృష్టించింది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో వరదనీరు పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదారమ్మ మహోగ్రూపంతో పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. 30 నుంచి 50వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చే జులై నెలలో అనూహ్యంగా 10లక్షల క్యూసెక్కుల నీరు చుట్టుముట్టడంతో పోలవరం ప్రాజెక్టు దగ్గర గంభీర వాతావరణం నెలకొంది. ఈ స్థాయి ఫ్లడ్ను ఊహించని ఇరిగేషన్ అధికారులు, ఆగమేఘాలపై సేఫ్టీ ప్రికాషన్స్ చేపట్టారు. పెద్ద మొత్తంలో వరద నీరు పోటెత్తుతుండటంతో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. 48 గేట్ల ద్వారా ఔట్ఫ్లో జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ అప్ స్టీమ్ దగ్గర ప్రస్తుత నీటిమట్టం 32 మీటర్లకు పైగా నమోదైంది. వరద ప్రవాహం అంతకంతకు పెరిగిపోతుండటంతో అప్రోచ్ ఛానల్ పూర్తిగా మునిగి స్పిల్వే వైపు ఉరకలేస్తోంది గోదారమ్మ. ప్రస్తుతం 10లక్షల క్యూసెక్కులున్న ఇన్ఫ్లో, 15లక్షలకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గంటగంటకూ వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. దాంతో, గంటకు 35 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతోంది నీటిమట్టం.
ఊహించని జలదిగ్బంధంతో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. డయాఫ్రం వాల్, లోయర్ కాఫర్ డ్యామ్, గ్యాప్-2 వర్క్స్ నిలిపేశారు అధికారులు. లోయర్ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పూర్తిగా గోదావరిలో మునిగిపోవడంతో క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..