త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అక్టోబర్లో ఇక్కడకు వచ్చే ప్రయత్నం చేస్తామని.. అయితే డిసెంబర్ నుంచి ఇక్కడే ఉంటామని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలనా విభాగంతో పాటు అధికారులు కూడా ఇక్కడికే వస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీ విశాఖపట్నమని.. నగరంలో మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎనిమిది యూనివర్శిటీలు, నాలుగు మెడికల్ కాలేజీలు,14 ఇంజనీరింగ్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలు విశాఖలో ఉన్నాయన్నారు. ప్రతి ఏటా వేల మంది ఇంజినీరింగ్ విద్యార్ధులను అందిస్తున్న ఏకైక నగరమన్నారు.
గుంటూరు ప్రాంత రైతులను మోసం చేసి విశాఖకు సీఎం జగన్ ఎందుకు వెళుతున్నారో సమాధానం చెప్పాలన్నారు జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసింది కేవలం శాటిలైట్ సెంటర్ మాత్రమేనన్నారు నాదెండ్ల. ఇందులో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు.
విశాఖ రాజధానిని ఎవరూ స్వాగతించడం లేదంటోంది టీడీపీ. ఇవాళ సీఎం పర్యటనకు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు ఆ పార్టీ నాయకులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.
ఇప్పటికే విశాఖలో సీఎంవో, ఇతర కీలక అధికారుల కార్యాలయాలకు అవసరమైన భనవాలు గుర్తించేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేశారు. ప్రస్తుతం ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో మౌలికవసతుల ఏర్పాటుపై దృష్టి సారించింది. తొలుత దసరా నుంచే పాలన ప్రారంభించాలని భావించినా..కమిటీ నివేదిక ఆధారంగా భవనాల లభ్యత చూసుకుని ఒకేసారి విశాఖకు తరలి వెళ్లాలని సీఎం నిర్ణయించారు. మొత్తానికి సీఎం చేసిన తాజా ప్రకటన మరోసారి రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..