
తిరుపతి, జనవరి 16: వేదాలు, పురాణాల్లో పేర్కొన్నట్లు సకల దేవతాస్వరూపాలు గోవులన్నారు టీటీడీ చైర్మన్ భూమన. గోవులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలని భూమన పిలుపు నిచ్చారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ రోజున టీటీడీ గో మహోత్సవ వేడుకలు నిర్వహించగా.. వేడుకల్లో ముఖ్య అతిథిగా భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గౌరిపూజ, తులసి పూజలో పాల్గొన్న భూమన అక్కడ ఉన్న గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు చెప్పారు. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2,500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఉత్సవాల్లో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు.
తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుంచి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు చెప్పారు. పూర్వం నుంచి కనుమ పండుగ రోజున గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందన్నారు భూమన. ఇప్పటి వరకు దాతలు రూ.250 కోట్లకు పైగా ఎస్వీ గో సంరక్షణట్రస్టుకు విరాళాలు అందించినట్లు వివరించారు. కనుమ పండుగ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి తోపాటు టీటీడీ గోసంరక్షణ ట్రస్టు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.