వైసీపీ నేతపై మర్డర్ అటెంప్ట్.. దాడికిగల కారణాలపై పోలీసుల దర్యాప్తు ..

| Edited By: Srikar T

Feb 10, 2024 | 10:42 AM

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎచ్చెర్ల మండల వైసీపీ మాజీ అధ్యక్షులు, ఎచ్చెర్ల మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకర్రావుపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.

వైసీపీ నేతపై మర్డర్ అటెంప్ట్.. దాడికిగల కారణాలపై పోలీసుల దర్యాప్తు ..
Attack On Ycp Leader
Follow us on

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎచ్చెర్ల మండల వైసీపీ మాజీ అధ్యక్షులు, ఎచ్చెర్ల మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకర్రావుపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. శంకరరావు రాత్రి 8గంటల సమయంలో S.M.పురం రోడ్‎లో ఎచ్చెర్ల లోని తన నివాసానికి వెళుతుండగా మాస్కులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపుకాసి వెనుక నుండి దాడి చేశారు. దాడి చేసే సమయంలో శంకర్ ముఖాన్ని వెనుకకు తిప్పడంతో తల వెనుకభాగంలో తగలవలసిన ఆయుధం ఎడమ చెంపకు తగిలి ఎడమ కన్ను, చెంప భాగంపై తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. దాడి జరిగిన వెంటనే బైక్ నడుపుతున్న శంకర్ అనుచరుడు మురళీ వాహనాన్ని ఆపితే మరింత ప్రమాదం అని భావించి ఆపకుండా నేరుగా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్‎కి తీసుకుపోయాడు. అనంతరం శంకర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. శంకర్ రావు ప్రస్తుతం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇతని భార్య విజయ ఎచ్చెర్ల మండల వైస్ MPP గా కొనసాగుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యేతో శంకర రావుకు విభేదాలు..

శంకర్ గత కొంతకాలంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‎పై అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో సొంత పార్టీలోని కొంతమంది అసమ్మతి నేతలతో కలిసి ర్యాలీలు, ప్రెస్ మీట్‎లు నిర్వహించారు. కిరణ్ వద్దు జగన్ ముద్దు అంటూ నినదించారు. ఈ క్రమంలో శంకర్‎పై జరిగిన దాడి నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. శంకర్‎ను హతమార్చాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులే మర్డర్ ఎటెంప్ట్ చేయించారని ఆరోపిస్తున్నారు శంకర్ సన్నిహితులు. ఈ దాడిపై పోలీసులు లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసిన వారిని, చేయించిన వారిని తొందరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.శంకర్ పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని అతని కుటుంబసభ్యులు, అనుచరులు, సహచర నాయకులు శ్రీకాకుళంలో చికిత్స అందుతోన్న హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి వరకు హై టెన్షన్ నెలకొంది. తర్వాత భద్రత దృష్ట్యా శంకర్‎ను అర్థరాత్రి వేళ కుటుంబసభ్యులు వేరే హాస్పిటల్ కు తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు..

శంకర్‎పై జరిగిన దాడి గురించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సిఐ రామచంద్రరావు, ఎస్సై చిరంజీవి ఘటన స్థలానికి చేరుకొని దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. దాడి జరిగిన సమయంలో శంకర్‎తో పాటు ఉన్న అతని అనుచరుడు మురళిని, కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‎లను పోలిసులు పరిశీలిస్తున్నారు. శంకర్‎పై జరిగిన దాడి రాజకీయ ప్రత్యర్ధులు పనా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి శంకర్ పై జరిగిన దాడితో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..