Andhra Pradesh: ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్లో సంచలన తీర్పు..!
ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. హత్య కేసులో కూడా 14 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే ఉంటుందని, కానీ ఫోక్సో కేసులో అంతకు మించిన శిక్షలు ఉంటాయని అంటున్నారు పోలీసులు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాన్ని నాశనం చేసి, చట్టపరమైన చర్యల ద్వారా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు..

ఇద్దరికీ ఒకే శిక్ష.. తప్పు చేసిన యువకుడికి న్యాయస్థానం మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తే.. తెలియక చేసిన తప్పుకు అయిన వారికి దూరమై, ఎలా బ్రతకాలో తెలియక క్షణక్షణం, భయం భయంగా కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతూ శిక్ష అనుభవిస్తుంది ఓ చిన్నారి. క్షణిక ఆకర్షణకి చిద్రమవుతున్న ఎందరో చిన్నారుల జీవితాలు ఇప్పుడు హృదయవిధారంగా మారుతున్నాయి. విజయనగరం జిల్లాలో నెలకొన్న ఓ ఘటన అందరినీ కలిచివేస్తుంది. తనను సంరక్షించే తల్లిద్రండులు లేక విజయనగరం జిల్లా బాలాజీ నగర్ లోని తన సమీప బంధువుల ఇంట్లో నివాసముంటుంది. అక్కడ నుండి పట్టణంలోనే ఓ టైప్ సెంటర్ కి వెళ్లి టైప్ నేర్చుకుంటుంది ఆ చిన్నారి.
అయితే అదే కోచింగ్ సెంటర్ లో టైప్ నేర్చుకునేందుకు నలం శివకుమార్ అనే ఓ యువకుడు కూడా జాయిన్ అయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం కు చెందిన 29 ఏళ్ల శివకుమార్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకునేందుకు విజయనగరం వచ్చి ఉంటున్నాడు. కొద్దిరోజుల తర్వాత టైప్ సెంటర్ లో ఇద్దరి మధ్య మాటా మాట కలిసి పరిచయం పెరిగింది. ఆ పరిచయంతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, తనతో ఉంటే జీవితం బాగుంటుందని నమ్మబలికాడు. తాను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి అయిన తర్వాత ఒక పెద్ద హోటల్ బిజినెస్ చేస్తానని, ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిలైపోవచ్చని రంగుల ప్రపంచాన్ని చూపించాడు. జీవితం అంటే తెలియని చిన్నారి శివకుమార్ మాయమాటలు నమ్మింది. తల్లిదండ్రులు లేని తనకు శివకుమారే సర్వస్వం అని భావించింది. అలా నమ్మిన బాలికతో విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ వంటి అనేక ప్రాంతాలు తీసుకువెళ్లి పలు టూరిస్ట్ స్పాట్ లు చూపించి కొత్త లోకాన్ని పరిచయం చేశాడు. ఆ సమయంలోనే ఆ చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి గర్భం దాల్చింది. అనంతరం గర్భం తొలగించేందుకు చిన్నారిపై అనేక రకాల ప్రయోగాలు చేశాడు.
అయినప్పటికీ గర్భం తొలగించడానికి కుదరలేదు. దీంతో హైదరాబాద్ తీసుకువెళ్లి ఒక ప్రవేట్ హాస్పిటల్ డాక్టర్ ను సంప్రదించి చిన్నారికి అబార్షన్ చేయాలని కోరాడు. అందుకు డాక్టర్ లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ చిన్నారిని అక్కడే వదిలి పరారయ్యాడు. బాలిక చేసేదిలేక తిరిగి విజయనగరంలోనే బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తెలియజేసింది. వెంటనే బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి సిద్ధమయ్యారు. అయితే బాలిక మాత్రం అందుకు ససేమేరా అని చెప్పింది. శివకుమార్ వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, అతని పై ఎలాంటి పోలీస్ కేసు పెట్టొద్దని కోరింది. దీంతో చేసేదిలేక బంధువులు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే మైనర్ బాలికకు ఓ బాబు పుట్టాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకు అనుకున్నట్లే శివకుమార్ తిరిగి బాలిక దగ్గరకు వచ్చాడు. కొద్ది రోజులు ఆమె వద్ద ఉండి మళ్లీ మాయమాటలు చెప్పడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మరోసారి గర్భం దాల్చింది బాలిక. దీంతో విషయం తెలుసుకున్న శివకుమార్ బాలికను వదిలేసి పరారయ్యాడు. ఆ తరువాత కొద్ది నెలలకు మరో బాబు పుట్టాడు. అలా ఇద్దరు పిల్లలు పుట్టడం, వారిని పెంచడం కష్టంగా మారింది. మళ్లీ వస్తాడనుకున్న శివకుమార్ ఎన్ని రోజులు ఎదురు చూసినా రాలేదు. దీంతో చేసేదిలేక ఇద్దరు పిల్లలతో బాధలు పడలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక.
కేసు నమోదు చేసిన పోలీసులు శివకుమార్ కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో శివకుమార్ మాత్రం జరిగిన విషయాలు అన్ని తప్పని బుకాయించాడు. బాలికను నేనేం చేయలేదని, పుట్టిన ఇద్దరు పిల్లలు తన పిల్లలు కాదని తెగేసి చెప్పాడు. దీంతో పోలీసులకి కూడా ఏం చేయాలో పాలుపోక డిఎన్ఏ టెస్ట్ ను ఆశ్రయించారు. అయితే డిఎన్ఏ టెస్ట్ మాత్రం ఇద్దరు పిల్లలకు శివకుమార్ తండ్రి అని నిర్ధారించింది. ఇదే విషయాన్ని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ త్రినాథ్. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నాగమణి నిందితుడు శివకుమార్ కు మరణించే వరకు కటిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. హత్య కేసులో కూడా 14 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే ఉంటుందని, కానీ ఫోక్సో కేసులో అంతకు మించిన శిక్షలు ఉంటాయని అంటున్నారు పోలీసులు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాన్ని నాశనం చేసి, చట్టపరమైన చర్యల ద్వారా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు..
ఇదిలా ఉంటే, అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రేమ పేరుతో మోసపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఇప్పుడా దుర్మార్గుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దీంతో ఆమెకు న్యాయం జరిగినట్టా..? ఆ ఇద్దరు పిల్లలకు తండ్రి ఎలా..? వారి ఆలనా పాలనా ఎవరి బాధ్యత..? ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు, అమ్మాయి తరపువారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..