Appalaraju on Chandrababu Naidu: కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితంగా ఉందంటూ అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు అనే పొలిటికల్ వైరస్ మాత్రమే రాష్ట్రాన్ని నాశనం చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేందుకు ప్రతిపక్షాలు, పచ్చ మీడియా ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు చనిపోవాలి, అశాంతి నెలకొనాలని చూస్తున్నారంటూ పేర్కొన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు వ్యాక్సినేషన్ పై నిజాలు తెలియదా..? అంటూ ప్రశ్నించారు. N440 వైరస్ లేదని శాస్త్రవేత్తలు చెప్పినా భయం సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో అబద్ధాలతో వారిని భయభ్రాంతులకు గురిచేయడం తగదంటూ హితవు పలికారు. అసలు సీసీఎంబీ డేటాను చంద్రబాబు ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఉండే లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని, ఆయనొక రాజకీయ ఉగ్రవాది అంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ను కేంద్రం.. రాష్ట్రాలకు వాటాగా ఇస్తోందని, ఇప్పటికైనా వ్యాక్సిన్పై దుష్ప్రచారం మానుకోవాలని.. అవసరమైతే వ్యాక్సిన్ వాటా కోసం పోరాడాలంటూ హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఇదిలాఉంటే.. మంత్రి అప్పలరాజుపై రవికుమార్, థరూర్ జేమ్స్ అనే ఇద్దరు వ్యక్తులు కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ చర్చాకార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..కర్నూలులో N440Kవైరస్ వ్యాప్తి చెందుతోందని, సాధారణ వైరస్ కంటే ఇది 15 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని మంత్రి మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.
Also Read: