
Chandrababu Naidu
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోనే విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గం.ల వరకు మాత్రమే విచారణ జరుగుతోంది. ఆ తర్వాతే రేపు కూడా సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించనున్నారు. మరి ఈ కేసులో శనివారంనాడు చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఏంటో చూద్దాం..
- రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. విచారణకు ముందుగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
- స్కిల్ కేసులో చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ….ఆయన చేసిన సంతకాలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జీవోకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడం, కేబినెట్ ఆమోదం కోసం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారని సమాచారం వస్తోంది.
- ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబు విచారణ జరుగుతోంది. పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని కోర్టు ఆదేశించడంతో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
- చంద్రబాబు విచారణకు 12 మంది సీఐడీ అధికారులు హాజరయ్యారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో విచారణ సాగుతోంది. సీఐడీ అధికారుల విచారణ రేపు కూడా కొనసాగనుంది.
- సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి గంటకు ఐదునిమిషాల పాటు విరామం ఇస్తున్నారు విచారణాధికారులు.
- సిఐడీ విచారణకు రాకముందే రాజమండ్రి జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబులెన్స్ లో జైలుకు చేరుకున్న వైద్య సిబ్బంది బాబుకు పరీక్షలు నిర్వహించి..అంతా బాగుందని చెప్పారంటున్నారు.
- చంద్రబాబు విచారణ నేపధ్యంలో రాజమండ్రి జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైలు దగ్గర రెండంచెల భద్రత ఉంది. టీడీపీ నేతలెవరూ నిరసన కార్యక్రమాలు చేయకుండా కట్టడి చేసింది.
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపు లాయర్లు. క్వాష్ పిటిషన్ కేసులో నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేశారు. బాబు పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
- బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 38 కేసుల్లో ఏ1గా ఉన్న జైలు మోహన్ పదేళ్లుగా బెయిల్పై ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని ప్రస్తావించాడు.
- అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన టీడీపీ నేతలు కొందరు రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రిలోనే ఉంటున్న కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న బాలయ్య…మరోవైపు పార్టీ నేతలతోను మాట్లాడుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..