
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల మంజూరు ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎంతోకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ఊరటనిస్తూ, ప్రతి జిల్లాలో తక్షణమే 200 కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పింఛన్ల మంజూరు విషయంలో కలెక్టర్లకు తగిన అధికారాలు లేకపోవడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అత్యవసర కేసుల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పింఛన్లను ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు, సర్వం కోల్పోయి ఆపదలో ఉన్నవారికి మంజూరు చేస్తారు. జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి, కలెక్టర్ సమన్వయంతో ఈ పింఛన్లపై నిర్ణయం తీసుకునేలా విచక్షణాధికారం కల్పించారు. పింఛన్ల పంపిణీలో ఎక్కడా రాజకీయం లేకుండా, అర్హతే ప్రామాణికంగా ఉండాలని సూచించారు.
ఇక తిరుపతి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనలో వచ్చిన విప్లవాత్మక మార్పులను చూసి మెచ్చుకున్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధి దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తిరుపతి జిల్లాకు ఏకంగా రూ. 96,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సదస్సులో వెల్లడించారు. వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..