Andhra Pradesh: ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ శుభవార్త.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నిరంతర సేవలు.. ఇకపై ఎప్పుడైనా..
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రజలకు సులువుగా సేవలు అందించేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు తమ సమస్యలను వేగవంతంగా పరిష్కరించుకునే ఏర్పాటు చేసింది. అదేంటి అనేది చూద్దాం.

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం సూపర్ న్యూస్ అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగవంతంగా అందుతున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకొవచ్చు. ఏ పని కావాలన్నా సరే సమీపంలోని ఈ కార్యాలయానికి వెళితే సులువుగా పూర్తవుతుంది. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, మార్పుల చేసుకోవాలన్నా, సర్టిఫికేట్లు పొందాలన్నా.. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సేవ అయినా ఇక్కడ పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతీ రోజు అర్జీలు ఇవ్వొచ్చు..
ప్రభుత్వ సేవలు, సర్వీసులు, తమ సమస్యలపై అర్జీలు అందించేందుకు గతంలో ప్రతీ సోమవారం అవకాశం కల్పించేవారు. ప్రతీ సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించేవారు. సోమవారం మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాత్రమే ఈ అర్జీలు తీసుకుంటుండటంతో అప్పటివరకు ఆగాల్సి ఉంటుంది. దీని వల్ల సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవ్వడంతో పాటు ఫిర్యాదు చేయడం ఆలస్యమవుతోంది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ రోజు అర్జీలను ప్రజల నుంచి తీసుకుంటారు. ప్రతీ రోజు సాయంత్రం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..
ఈ కార్యక్రమం సమయంలో ప్రతీఒక్క సిబ్బంది ఖచ్చితంగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సంబంధిత శాఖ అధికారుల వద్దకు వీటిని పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, సర్వే, పశుసంవర్థక, ఇంజినీరింగ్, వ్యవసాయ సహాయకులు ప్రతీరోజు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక సచివాలయాల్లో ప్రత్యేక క్యూర్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. దీనిని స్కాన్ చేసి ప్రజలు ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అర్జీల స్వీకరణ, పరిష్కారంపై ప్రజలు తమ స్పందన తెలియజేయవచ్చు. క్యూఆర్ కోడ్ ప్రతీ సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు ఎప్పుడైనా అర్జీలు సమర్పించి ప్రభుత్వ పథకాలు, సేవలపై తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
