
రామాయపట్నం పోర్టు అభివృద్ధిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి తొలి దశలోనే రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియంతో పాటు దీర్ఘకాలిక ఆదాయం లభించనుంది. మరోవైపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, సుమారు 25 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టికి ఈ పోర్టు వేదిక కానుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
నెల్లూరు జిల్లా తీరంలో నిర్మితమవుతున్న రామాయపట్నం పోర్టు.. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటి. 2,538 ఎకరాల్లో 19 బెర్తులతో, 138.54 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక కార్గో సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు 80.50 శాతం పూర్తయ్యాయి. 2026 డిసెంబర్ నాటికి పోర్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.
పోర్టు నిర్వహణ కోసం ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానాన్ని ఎంచుకుంది. అయితే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పోర్టు భూమి, యాజమాన్యం, సముద్రతీర హక్కులు, విధాన నిర్ణయాలు, భద్రత, పర్యావరణ నియంత్రణ.. అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి. ప్రైవేట్ భాగస్వామి కేవలం నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను మాత్రమే చేపడతాడని ప్రభుత్వం వెల్లడిస్తోంది.
ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పోర్టు నిర్వహణ హక్కులు పొందే సంస్థ ముందుగానే రూ.1,500 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రతి ఏడాది కనీస హామీ ఆదాయం కూడా చెల్లించాలి. ప్రారంభంలో రూ.10 కోట్లుగా ఉండే ఈ మొత్తం, ఒప్పంద కాలంలో రూ.150 కోట్ల వరకు పెరుగుతుంది. అంతేకాదు, రెవెన్యూ షేరింగ్ ద్వారా కూడా ప్రభుత్వానికి నిరంతర ఆదాయం లభించేలా ఒప్పందాన్ని రూపొందించారు.
రామాయపట్నం పోర్టు చుట్టూ భారీ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోర్టు ఆధారంగా పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు, ఎగుమతి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 25 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రామాయపట్నం పోర్టులో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు 12 శాతం నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ వాటాను శాశ్వతంగా కొనసాగించనుంది. అంటే పోర్టులో ప్రభుత్వ వాటా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. అంతేకాదు, పోర్టు విస్తరణతో జరిగే ప్రతి పెట్టుబడిలోనూ ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం కలిగేలా ఒప్పంద నిబంధనలు రూపొందించారు.
పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు వేగవంతం కావడంతో పాటు తీర ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియం, రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగాల అవకాశాలతో రామాయపట్నం పోర్టు… ఆంధ్రప్రదేశ్ పోర్టు ఆధారిత ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..