Andhra Pradesh: నెలాఖరుకల్లా అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ.. ఏపీ సీఎం జగన్ ప్రకటన

| Edited By: Janardhan Veluru

Sep 26, 2022 | 4:33 PM

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

Andhra Pradesh: నెలాఖరుకల్లా అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ.. ఏపీ సీఎం జగన్ ప్రకటన
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 26వ తేదీ సోమవారం తాడేపల్లిలోని సీఏం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో టాయిలెట్ల మెయింటెనెన్స్‌ కోసం ఏర్పాటుచేసిన TMF, స్కూళ్ల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన SMF తరహాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జరగాలన్నారు. పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా SMF, TMF తరహాలో నిర్వహణ పర్యవేక్షణకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు.

అంగన్వాడీ పిల్లలకు ఇప్పటినుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు  సీఏం జగన్. పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలని సీఏం జగన్ సూచించారు. అన్నీకూడా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఉండాలని, అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు సీఏం జగన్. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సీఏం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సమీక్షించిన సీఏం, పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలని సూచించారు. నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలని, మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్‌ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలని సూత్రప్రాయంగా ఈసమావేశంలో సీఏం నిర్ణయించారు. పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని సీఏం జగన్మోహన్ రెడ్డి సూచించారు. కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని. అందువల్ల లబ్ధిదారు అయిన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని ఈసందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీ: అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై సీఏం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాల సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉందని, పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

దివ్యాంగుల కోసం: రాష్ట్రంలోని దివ్యాంగులకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

జువైనల్‌ హోమ్స్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జువైనల్‌ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..