
ఏపీలో వరుస చిన్నారుల మిస్సింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నెలరోజుల క్రితం అదృశ్యమైన జ్ఙానేశ్వరి ఆచూకీ కోసం నేటికీ పోలీసులు గాలింపు చేస్తుండగా తాజాగా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంలో ఆరేళ్ల బాలుడు రిచర్డ్ రేయాన్స్ మిస్సింగ్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న రేయాన్స్ సడెన్గా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం పేరెంట్స్ చుట్టు పక్కల ఎంత వెతికినా కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో ఘటనా స్థలానికి చేరుకుకున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. బాలుడు మూగ, చెవిటి కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అయితే బాలుడి తల్లికి ఇటీవలే స్థానికంగా ఉన్న నర్సింగ్ స్కూల్లో ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ ప్రాంతం కొత్త కావడంతో బాలుడు దారితప్పి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే బయటకు వెళ్లిన బాలుడు.. ఓ షాప్లో చాక్లెట్ తీసుకొని తిరిగి వెళ్లినట్టు కొందరు స్థానికులు చెబుతున్నారు. కానీ కచ్చితంగా బాలుడి ఆచూకీ మాత్రం తెలియడం లేదు.
దీంతో బాలుడి ఆచూకీ కోసం 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. బాలుడు వెళ్ళిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు ముమ్మురం చేశారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తులను విచారించడంతో పాటు వాహన తనిఖీలు చేపట్టి, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని, బాలుడిని చివరిసారిగా చూసిన వ్యక్తులను గుర్తించి వారి నుంచి సమాచారం సేకరించాలని జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచించారు.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లతో పాటు పక్క జిల్లాలోని పోలీసులకు బాలుడి ఫోటోలను పంపించి ఆరా తీస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో విచారణ కొనసాగించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరోవైపు ఈ ప్రాంతానికి తాము కొత్తగా వచ్చామని, తమకు ఎవరితో విబేధాలు లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.