
పండించిన పంట ధరలు పెరిగితే రైతుకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. కానీ, అక్కడ అలా జరగలేదు.. రైతు కంట కన్నీరు మిగిల్చింది.. ప్రతియేటా పండించిన పంటకు ధరలు లేక తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులకు ఇప్పుడు ధరలు పెరిగినా మరింత నష్టాలు మిగిలాయి.. గత ఏడాది కంటే మూడింతలు ధరలు పెరిగినా ఆదాయం రాలేదు కదా, అసలు కూడా గిట్టలేదని రైతులు వాపోతున్నారు.. ఇంతకీ ఎంటా పంట.. ధరలు పెరిగితే సంతోష పడాల్సిన రైతు బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..
తమలపాకు అంటే భోజనం తరువాత నోట్లో వేసుకునే కిల్లి మాత్రమే కాదు.. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలకు తమలపాకు పళ్లెంలో తప్పకుండా ఉండాల్సిందే.. ఆలయాల్లో అయినా, మరి ఎక్కడైనా జరిగే పూజా కార్యక్రమాల్లోనూ తమలపాకులు కచ్చితంగా ఉంటాయి.. అన్ని విధాలుగా వినియోగంలో ఉండే తమలపాకు సాగు చేసే రైతుకు మాత్రం ప్రత్యేక నష్టాలే మిగులుతున్నాయి.
మన రాష్ట్రంలో సాగుతున్న వాణిజ్య పంటల్లో తమలపాకు కూడా ఒకటి.. ఏపీలో నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో తమలపాకు విస్తారంగా సాగు చేస్తుంటారు.. మిగిలిన పంటలతో పోల్చితే తక్కువనేటితోనే సాగు చేయడం పెట్టుబడులు కూడా తక్కువగా ఉండడంతో దశాబ్దాల నుంచి నెల్లూరు జిల్లాలో రైతులు తమలపాకు సాగును ఎక్కువగా చేస్తున్నారు.. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా తమలపాకు పంటకు గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోతు వస్తున్నారు రైతులు.
ఒక పంతం అంటే 170 నుంచి 180 తమలపాకులు కలిపిన ఒక కట్ట.. అలాంటి 100 పంతాల ధర గత ఏడాది వరకు 2000 నుంచి 2500 వరకు మాత్రమే ఉంది.. ఈ ఏడాది 100 పంతాల ధర ఏకంగా మూడింతలు పెరిగి 7500 గా ఉంది.. తేడాది వరకు 2000 మాత్రమే ఉన్న తమలపాకు ధర 7000 దాటిన తమలపాకు రైతుకు నష్టాన్ని కష్టాన్ని మిగిల్చింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు వింజమూరు ప్రాంతాల్లోకి వేల ఎకరాల్లో తమలపాకు సాగు అవుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మోంథా ,ద్విత్వ తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట ఎదుగుదల దెబ్బతిని, దిగుబడి గణనీయంగా తగ్గింది.
గతంలో ఎకరానికి 3,000 పంతాల వరకు వస్తే, ఇప్పుడు 800 నుండి 1,200 పంతాల దిగుబడి మాత్రమే ఉంది. తమలపాకు ఉత్పత్తి తగ్గడంతో ధరల పెరిగాయి. కానీ, దిగుబడి లేకపోవడంతో ఆదాయం రావాల్సిన సమయంలో రైతుకు తీవ్ర కష్టాన్ని మిగిల్చాయి.. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న తమలపాకు తోటలను రెండు నెలల క్రితం తిరిగి సాగు చేయగా దిగుబడి రావడానికి మరి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటికి ఈ ధరలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆందోళనపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..