ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. వెంటనే సభ హర్షధ్వానాలతో మార్మోగింది. అనంతరం అయ్యన్నపాత్రుడిని సీఎం చంద్రబాబు నాయుడు, ఢిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకు వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం 5గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెదేపా ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీచేసి ఏడుసార్లు గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు-భవనాలు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అయితే, ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండేలా కనిపిస్తోంది. డిప్యూటీ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కూటమిలో ఇంకా స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..