
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ MLAలంతా సభకు హాజరైనట్టా.. కానట్టా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెక్నికల్గా దీన్ని హాజరుగా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ లేదని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నారు. అటు.. 60 రోజులపాటు వరుసగా సభకు రాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుందనే నిబంధనను అధికారపక్షం పదేపదే గుర్తు చేస్తోంది.
అయితే.. నిన్న గవర్నర్ ప్రసంగానికి తమ సభ్యులు హాజరవడంతో అలాంటిదేమీ ఉండబోదని YCP అంటోంది. కానీ.. ఉమ్మడి సభకు హాజరును లెక్కలోకి తీసుకోరనేది శాసనసభ వ్యవహారాలు చూస్తున్నవాళ్లు చెప్తున్న మాట. ప్రజాసమస్యలపై పోరాడేందుకు విపక్ష హోదా ఇవ్వాల్సిందేనని.. అంత వరకూ సభకు రాబోమని నిన్న సమావేశానికి హాజరైన తర్వాత మరోసారి ప్రకటించారు YCP నేతలు. ఇవాళ్టి నుంచి సమావేశాలకు మండలికి YCP సభ్యులు వెళ్తున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. ఏదున్నా మీడియా ద్వారానే ప్రజలకు వివరిస్తామంటున్నారు.