YS Jagan: టెన్షన్.. టెన్షన్.. వారికి టికెట్ లేనట్లే.. 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నుంచి పిలుపు..
ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జ్లను మార్పు చేసిన వైసీపీ బాస్.. రెండో జాబితా సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీంతో లిస్ట్లో ఉండేదెవరు..ఊడేదెవరు ? ప్రమోషన్ ఎవరికి..డిమోషన్ ఎవరికి..? అనే టెన్షన్ వైసీపీ నేతల్లో మొదలయింది. మార్పుల్లో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు కావడంతో.. తాడేపల్లి నుండి ఫోన్లు వచ్చిన నేతలు కలవర పడుతున్నారు.

2024 ఎన్నికలే టార్గెట్గా అభ్యర్థుల ఎంపికపై తాడేపల్లిలో తీవ్ర కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం. అభ్యర్థుల పనితీరు, సర్వేలు, నివేదికలతో పాటు ప్రస్తుత రాజకీయ సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా చోట్ల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. టికెట్ ఇవ్వలేని నేతలను క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకుని.. పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని వివరించడంతో పాటు.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెబుతున్నారు. ఫస్ట్లిస్ట్లో 11 మంది గుంటూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్సార్సీపీ అధిష్టానం.. ఇపుడు ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల లిస్ట్ను ఫైనల్ చేస్తోంది. అలాగే రాయలసీమ నేతల లిస్ట్పై కూడా పార్టీ పెద్దలు దృష్టి సారించారు. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలిపిస్తున్న వైఎస్ జగన్.. వారికి తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్నారు. ఎంత పెద్ద లీడర్ అయిన పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెబుతున్నారు.
20 మందికి పైగా ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి పిలుపు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు..సీఎం వైఎస్ జగన్. అయితే వీరంతా సీటు కోల్పోతున్న వారే కావడం విశేషం. వారికి సీటు ఎందుకు ఇవ్వడం లేదు? స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలను పార్టీ పెద్దలు వివరిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి సర్వే నివేదికల ఆధారంగా నేతల సీట్లపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం క్యాంప్ ఆఫీస్లో వర్క్ షాప్లు నిర్వహించిన సమయంలోనే కొంతమందికి వార్నింగ్ ఇస్తూ వచ్చారు జగన్. రెండు రోజుల్లో 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది. వీరంతా సీఎం జగన్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు సీటు లేదని చెప్తుంటే.. మరికొంతమందిని ఇతర నియోజకవర్గాలకు మారుస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీలు కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
ప్రస్తుతం పదకొండే.. త్వరలో మరిన్ని మార్పులు ఉంటాయంటూ ప్రకటించారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దాంతో, రెండో విడతలో 40చోట్ల మార్పులు ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ అంతకుమించే మార్పులు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఆరేడు నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనేది ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తోన్న మాట. మరి శుక్రవారం విడుదలయ్యే లిస్ట్లో ఎవరి జాతకాలు మారుతాయో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
