ఏ శాఖలో అయినా, అధికారులపై లోకల్ లీడర్లు పెత్తనం చెలాయించడం సాధారణం. కానీ, తాము చెప్పింది చెయ్యకపోతే చస్తావ్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడమే కాదు, మందినేసుకొచ్చి దాడి కూడా చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ కమిషనర్పై దాడి ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాయచోటిలో ఏళ్లనుంచి నడుస్తున్న ఓ వివాదం, ఇప్పుడు ఫైటింగ్ దాకా వచ్చింది. లేఅవుట్కి పర్మిషన్ ఇవ్వలేదన్న కారణంతో, రౌడీలను వెంటబెట్టుకుని, కండబలం చూపించారు కౌన్సిలర్ నరసింహారెడ్డి. మాట్లాడుతుండగానే రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై ఒక్కసారిగా ఎటాక్కు దిగారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని చెబుతున్నా వినకుండా దాడి చేశారని, ఇదెక్కడి అరాచకమని వాపోతున్నారు మున్సిపల్ కమిషనర్ రాంబాబు.
కమిషనర్ వెర్షన్ ఇలా ఉంటే, కౌన్సిలర్ మాత్రం కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తమను లంచం అడిగారని, సిండికేట్ని ఫామ్ చేసుకుని పర్మిషన్ ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని చెబుతున్నారు కౌన్సిలర్ నరసింహారెడ్డి.
ఎవరి వాదన ఎలా ఉన్నా, కమిషనర్పై దాడి ఇష్యూపై కౌన్సిలర్ నరసింహారెడ్జితో పాటు ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు పక్షాల వెర్షన్స్ విన్న తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.
అటు, మున్సిపల్ కమిషనర్పై దాడిని ఖండించారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఏ వ్యక్తి పైనా దాడి చేయడం సమర్ధనీయం కాదన్నారు. కమిషనర్పై దాడి చేయడంపై మున్సిపల్ సిబ్బంది ఫైర్ అవుతున్నారు. విధులను బహిష్కరించారు. తమకు రక్షణ ఏదని ప్రశ్నిస్తున్నారు.
కొన్నాళ్లుగా లేఅవుట్లు, వాటి పర్మిషన్లపై రాయచోటిలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆ వ్యవహారం కమిషనర్పై దాడి చేసేదాకా వచ్చింది.