AP Politics: సలసలా కాగుతున్న పలాస రాజకీయం.. కాళ్లు విరగ్గొడతానంటూ మంత్రికే వార్నింగ్..

వ్యక్తిగత విమర్శలు.. సవాళ్లు.. వార్నింగ్‌లతో పలాస రాజకీయం సలసలా కాగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య మాటల యుద్ధం డైరెక్ట్‌ వార్‌గా మారిపోయింది. 2019 ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య మొదలైన పొలిటికల్ వార్‌ పీక్స్‌ చేరుకుని..

AP Politics: సలసలా కాగుతున్న పలాస రాజకీయం.. కాళ్లు విరగ్గొడతానంటూ మంత్రికే వార్నింగ్..
Ycp Vs Tdp

Updated on: Apr 05, 2023 | 7:16 AM

వ్యక్తిగత విమర్శలు.. సవాళ్లు.. వార్నింగ్‌లతో పలాస రాజకీయం సలసలా కాగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య మాటల యుద్ధం డైరెక్ట్‌ వార్‌గా మారిపోయింది. 2019 ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య మొదలైన పొలిటికల్ వార్‌ పీక్స్‌ చేరుకుని.. ఇప్పుడు వార్నింగ్‌లు ఇచ్చుకునే వరకు వెళ్లింది.

నువ్వు ఒకటంటే నేను రెండు అంటాననేలా అప్పలరాజు, శిరీష మధ్య వివాదం ముదురుతోంది. గతంలో దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న గౌతు ఫ్యామిలీ వల్లే పలాస అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు అప్పలరాజు. దీనికి శిరీష అభ్యంతరం తెలియజేయడమే కాదు.. పర్సనల్‌ అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని మంత్రికి కౌంటర్‌ ఇచ్చారు.

గతంలో అక్రమాలు జరిగితే అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న గౌతు కుటుంబం ఏం చేస్తోందని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు. ఈ క్రమంలో ఆయన ప్రయోగించిన పదజాలం ప్రత్యర్థి శిబిరాన్ని గట్టిగానే తాకింది. ఇంకోసారి పర్సనల్‌ విషయాలు తీసుకొస్తే ఇంటికొచ్చి కాళ్లు విరగ్గొడతానని మంత్రిని హెచ్చరించారు గౌతు శిరీష.

తన టీమ్‌లో కొందరు సభ్యులు ఉన్నారని.. వారు పలాస ప్రజల అభివృద్ధి కోసమే పరితపిస్తున్నారని చెప్పారు మంత్రి అప్పలరాజు. ఆ టీమ్‌ తప్పు చేస్తే తాను చేసినట్టేనని అభివర్ణించారు కూడా. అయితే ఆ టీమ్‌ను అప్పన్న దర్బార్‌గా అభివర్ణించారు గౌతు శిరీష. పలాసలో టీడీపీ నేతలపై దాడులను ప్రస్తవిస్తూ.. తనపై దాడి చేసి చూసి చూడు ఏం జరుగుతుందో అని సవాల్‌ చేశారు శిరీష.

పలాసలో తాతలు తండ్రులు పేరు చెప్పుకొంటూ చాలా మంది కాలం గడిపేస్తున్నారని మంత్రి అప్పలరాజు ఆరోపించడంతో.. మరింత భగ్గుమన్నారు గౌతు శిరీష. మంత్రిని ఉద్దేశించి తీవ్ర పదజాలమే ప్రయోగించారామె. మంత్రి అప్పలరాజును టార్గెట్‌ చేస్తూ చింత నిప్పులు తొక్కారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాసలో టీడీపీ నేతలపై దాడులు చేసిన వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు శిరీష. స్థానిక డీఎస్పీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..